హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ సోకినా, టీకా వేసుకున్నా కంటి చూపు తగ్గిపోతున్నదని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఇది అబద్ధం. కరోనా మొదటిసారి సోకినప్పుడు రోగుల్లో జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించాయి. సెకండ్వేవ్లో పరివర్తనాల కారణంగా కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది కంటిచూపు తగ్గుతున్నదని ప్రచారం చేస్తున్నారు.
కరోనాకు కంటిచూపుకు సంబంధం లేదు
కరోనా సోకిన రోగులకు కంటిచూపు పోతున్నదని, చూపు తగ్గుతున్నదని వస్తున్న వార్తల్లో నిజంలేదని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. వైరస్ సోకితే కొందరిలో కండ్లు ఎర్రబడవచ్చని చెప్తున్నారు. వైర స్ కంటిచూపుపై ప్రభావం చూపించిన దాఖలాలు లేవని తెలిపారు. వైరస్ గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీ మెదడు తదతర ప్రధాన అవయవాలపైనే ప్రభావం చూపుతున్నదని, తీవ్ర, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారిలోనే అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని చెప్తున్నారు. ‘సాధారణంగా షుగర్ లెవల్స్ కంటిచూపుపై ప్రభావం చూపిస్తాయి. షుగర్ తీవ్రస్థాయికి చేరితే కంటిచూపు దెబ్బతినే అవకాశముంటుంది. కానీ కరోనాకు కంటిచూపు తగ్గడానికి సంబంధం లేదు. వైరస్ ముక్కు, నోరుతోపాటు కండ్ల ద్వారా సోకే అవకాశముంది. అందువల్ల మాస్కుతోపాటు కండ్లకు రక్షణ ఇచ్చే అద్దాలు, ఫేస్షీల్డ్ ధరించడం ఉత్తమం’అని సరోజినీదేవి కంటి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం తెలిపారు.