హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): దమ్ముంటే దళితబంధు పథకాన్ని కర్ణాటకలో అమలు చేసి చూపించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. రూ.12 లక్షలతో కాకున్నా.. కనీసం రూ.5 లక్షలతోనైనా ఆ పార్టీ పాలిత ప్రాంతాల్లో పథకాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ పార్టీ అమాయక ఎస్సీ, ఎస్టీ వర్గాలను మరోసారి మోసం చేయాలని ఇక్కడ దొంగ డిక్లరేషన్లు ప్రకటిస్తున్నదని దుయ్యబట్టారు.
శుక్రవారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాదరావు, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రకటించిన మ్యానిఫెస్టోను ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో అమలు చేసి, చూపాలని సవాల్ విసిరారు. 50 ఏండ్లకుపైగా దేశాన్ని పాలించి.. 40 కోట్ల మంది దళిత, గిరిజనులను మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని నమ్మేందుకు దళిత, గిరిజనులేం అమాయకులు కాదని పేర్కొన్నారు. దళిత, గిరిజన జనోద్ధరణ కోసం, అన్ని రంగాల్లో వారి అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్లాగా ఎవరూ పాటుపడలేదని చెప్పారు. దళితబంధు ద్వారా ఇప్పటికే రాష్ట్రంలోని 40 వేల దళిత కుటుంబాల్లో వెలుగులు నిండాయని, దశలవారీగా ఈ పథకం అమలు చేస్తూ ఆ వర్గాలను సమగ్రాభివృద్ధిపథంలో నడిపించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు.
విద్యతోనే దళిత సమాజం పురోభివృద్ధి చెందుతుందనే రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని సీఎం కేసీఆర్ నూటికి నూరుపాళ్లు ఆచరిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఇంటింటా విద్యా సుగంధాలు పూయిస్తున్నారని తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా 1,006 గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఇన్ని గురుకుల విద్యాలయాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్ల మీద, అధికారం మీద ఉన్న ప్రేమ దళిత, గిరిజనుల మీద లేదని పేర్కొన్నారు.
దళితులను రెచ్చగొడుతున్న పార్టీలు
దళితబంధు పథకంలో అవినీతి జరుగుతున్నదని కావాలనే కొన్ని పార్టీలు దళితులను రెచ్చగొడుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు దళితబంధు పథకానికి అర్హులు కాకూడదా? అని ప్రశ్నించారు. తమకు పార్టీలు, కార్యకర్తలు ముఖ్యం కాదని, నిబంధనల మేరకు లబ్ధిదారుడు దళితబంధు పథకం పొందడానికి అర్హుడా? కాడా? అన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో దశలవారీగా దళితబంధు పథకం అమలుచేస్తామని, రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్క దళితుడికి ఈ పథకం వర్తింజేస్తామని స్పష్టం చేశారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ
ఏ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఏకకాలంలో 119 అసెంబ్లీ సీట్లలో 115 సీట్లలో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించిన చరిత్ర ఎప్పుడూలేదని, బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు మాత్రమే ఇది సాధ్యమని పేర్కొన్నారు. జమిలి ఎన్నికల విషయంలో కేసీఆర్ అన్నిస్థాయిల్లో చర్చించి నిర్ణయం తీసుకొంటారని చెప్పారు.