రైతులకు అవగాహన కోసం ప్రత్యేక పుస్తకం ముద్రణ
ఏర్పాట్లు చేస్తున్న వ్యవసాయ శాఖ
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): పంటల సాగుపై ప్రత్యేక డాక్యుమెంటరీ ఫిల్మ్ను రూపొందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనితోపాటు ప్రత్యేకంగా పుస్తకాన్ని కూడా ముద్రించనున్నది. ఇప్పటికే తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ అధికారులు పని ప్రారంభించారు. పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా వీటిని రూపొందించనున్నారు. ఇప్పటికే ఓ పుస్తకం, వ్యవసాయ వర్సిటీకి యూట్యూబ్ చానల్ ఉండగా మారుతున్న సాంకేతికత, వ్యవసాయ పద్ధతులకు అనుగుణంగా కొత్త పుస్తకాన్ని తీసుకురావాలని వ్యవసాయ శాఖ భావించింది.
నూతన సాగు విధానాలపై ప్రత్యేక డాక్యుమెంటరీ, పుస్తకాన్ని ముద్రించాలని ఇటీవల వ్యవసాయశాఖ సమీక్షలో సీఎం కేసీఆర్.. వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సాంకేతికత, యాంత్రీకరణ ద్వారా ఏ పంటను ఏ విధంగా సాగు చేయాలి? ఏ సమయంలో ఎలాంటి ఎరువులు వేయాలి? వంటి సాగు యాజమాన్య పద్ధతులను డాక్యుమెంటరీ, పుస్తకంలో పొందుపర్చాలని అధికారులు నిర్ణయించారు. డాక్యుమెంటరీలో పలు పంటల సాగులో విజయం సాధించిన రైతుల అనుభవాలను పొందుపర్చనున్నారు. ఈ డాక్యుమెంటరీని యూట్యూబ్లో ఉంచి, పుస్తకాలను రైతు వేదికల ద్వారా పంపిణీ చేస్తారు. వానకాలం సీజన్ ప్రారంభం నాటికి వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.