హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): అన్ని పీహెచ్సీల్లో వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాల్సిందేనని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. 24 గంటలపాటు పీహెచ్సీల్లో నిరంతరం సేవలు అందాలని ఆదేశించారు. పీహెచ్సీల పనితీరుపై గురువారం అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లతో హరీశ్రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. గత నెల 5న సమీక్ష నిర్వహించామని, ఈ నెల రోజుల్లో పలు జిల్లాలు పురోగతిని సాధించాయని ప్రశంసించారు. మంజూరుచేసిన బస్తీ దవాఖనలను అన్ని జిల్లాల్లో త్వరగా ప్రారంభించాలని సూచించారు.
పీహెచ్సీ స్థాయికి ఆరోగ్య శ్రీ సేవలను విస్తరిస్తున్నామని, దీనికి అనుగుణంగా వైద్యసిబ్బందికి శిక్షణ పూర్తిచేయాలని డీపీహెచ్ శ్రీనివాసరావును ఆదేశించారు. సాధారణ ప్రసవాలు పెంచాలనే లక్ష్యంతో వైద్యులకు, నర్సులకు ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నట్టు చెప్పారు. గర్భిణులు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించేలా చూడాలని, సిజేరియన్లు తగ్గించాలని స్పష్టంచేశారు. జిల్లా కలెక్టర్ల సహకారంతో వేద పండితులతో సమావేశం ఏర్పాటుచేసి సీ-సెక్షన్లకు ముహూర్తాలు పెట్టొద్దని కోరాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు గైనకాలజిస్టులతో సమావేశమై సిజేరియన్లు తగ్గించేలా భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. పీహెచ్సీల్లో అన్నిరకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని పీహెచ్సీ వైద్యులను ఆదేశించారు. డీఎంహెచ్వోలు ప్రతి పీహెచ్సీని ఆకస్మిక తనిఖీచేయాలని, సూపర్వైజర్లు వారానికి మూడునాలుగు రోజులు ఫీల్డ్లో ఉండాలని స్పష్టంచేశారు.