LV Prasad Eye Hospital | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): కంటి బాహ్యపొర కార్నియా చికిత్సలో విప్లవాత్మక విధానాన్ని ఆవిష్కరించిన హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ కంటి దవాఖాన వైద్యులకు ఆ వైద్య విధానంపై పేటెంట్ లభించింది. కార్నియా దెబ్బతింటే ఇప్పటివరకు మరొకరి నుంచి సేకరించిన కార్నియాతో ట్రాన్స్ప్లాంట్ చేసేవారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఎల్వీపీఈఐ వైద్యులు డాక్టర్ సయన్బసు, డాక్టర్ వివేక్సింగ్ దాదాపు 20 ఏండ్లు శ్రమించి మూలకణ చికిత్సను ఆవిష్కరించారు.
కంటి బాహ్యపొరనుంచి సేకరించిన మూల కణాలతో దెబ్బతిన్న కార్నియా స్థానంలో కొత్త కార్నియా సహజంగా ఏర్పడేలా చేయటమే ఈ చికిత్సా విధానం. ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఇద్దరు వైద్యులకు తాజాగా పేటెంట్ జారీచేసింది. ఈ సందర్భంగా బసు మాట్లాడుతూ.. ఈ చికిత్స విధానం క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే.. కార్నియా చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని చెప్పారు. తాము ఆవిష్కరించిన వైద్య విధానంతో కెరటోకోనస్ సమస్యకు కూడా సులభంగా వైద్యం చేయవచ్చని వివరించారు.