హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): జడ్చర్లలోని ప్రభుత్వ దవాఖాన వైద్యులపై జారీచేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దుచేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. దవాఖాన మార్చురీని 24 గంటలపాటు నిర్వహించడం వైద్యుల బాధ్యత కాదని పేర్కొన్నది. వైద్యుల బాధ్యత సమయానికి పోస్టుమార్టం నిర్వహించడం మాత్రమేనని, మార్చురీ నిర్వహణ, భద్రత, పర్యవేక్షణ బాధ్యతలు మార్చురీ సూపర్వైజర్లు, సంబంధిత సహాయక సిబ్బందివేనని అధ్యక్షుడు డాక్టర్ నరహరి, సెక్రటరీ డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్, కోశాధికారి డాక్టర్ ఎంకే రౌఫ్ తెలిపారు. పాత దవాఖాన భవనంలో మార్చురీ ఉన్నదని, అది శిథిలావస్థకు చేరిందని, అందువల్ల జంతువులు, కుకలు, ఎలుకలు ప్రవేశించే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. వైద్యులు ప్రధానంగా రోగుల చికిత్స, వైద్య సేవలపైనే దృష్టి సారిస్తారని, ఈ ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నదని పేర్కొంటూ చర్యలు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చురీ మౌలిక వసతుల బలోపేతానికి సంసరణలు తేవాలని డిమాండ్ చేశారు.