అవార్డుకు భారత్ నుంచి ఎంపికైన తొలి వైద్యుడు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 : ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అగ్రశ్రేణి గ్యాస్ట్రో ఎంటరాలజీ అసోసియేషన్ ఈ ఏడాదికి గాను ‘విశిష్ట విద్యావేత్త’ అవార్డుకు డాక్టర్ నాగేశ్వర్రెడ్డిని ఎంపికచేసింది. గ్యాస్ట్రో ఎంటరాలజీ రంగంలో ఆయన చేస్తున్న విశేష కృషిని అభినందిస్తూ ఈ అవార్డుకు ఎంపికచేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. భారత్లో ఎండోస్కోపిక్ విద్య కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదల కోసం ఆయన కృషి చేస్తున్నారని వివరించారు. కాగా, ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు భారత్ నుంచి ఎంపికైన తొలి వైద్యుడు ఈయనే. అమెరికాలో మే నెలలో జరిగే కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వర్రెడ్డికి ఈ అవార్డును అందజేయనున్నారు.