హైదరాబాద్: తన ఆస్తులకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు (BJP MLA Raghunandan rao) చేసిన ఆరోపణలు నిరాధరమైనవని, ఖండిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. అసలు ఆర్డీఎస్ కాలువ (RDS Cannal) ఎక్కడుందో తెలుసా అని రఘునందన్ను ప్రశ్నించారు. ఆయన చూపిన పత్రాలు శుద్ధ అబద్ధాలని చెప్పారు. సర్వే నంబర్ 60లోని భూముల్లో కేవలం మూడు ఎకరాల భూమి తమ వాళ్లదని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రఘునందర్ రావు ఆరోపణలు తప్పని రుజువైతే ఆయన ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి ఉన్న మొత్తం భూమి 90 ఎకరాలు మాత్రమేనని చెప్పారు.
తన వ్యవసాయ భూమిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు లేవని మంత్రి అన్నారు. తన భూమిలో ఫౌల్ట్రీ, డెయిరీ షెడ్లు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. తనకున్న ఆస్తులు.. మంత్రి పదవి రాకముందు నుంచి ఉన్నవేనని స్పష్టం చేశారు. తన ఇల్లు రఘునందన్కు ఇచ్చి.. ఆయన ఇల్లు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రఘునందన్ వస్తే ఆయన ముందే సర్వే జరిపిస్తామన్నారు. తాము కొన్న భూమి కంటే గుంట ఎక్కువ ఉన్నా.. ఏ చర్యకైనా సిద్ధమని మంత్రి అన్నారు.