ఎన్నికల ప్రచారం మొదలైనప్పటినుంచే తెలంగాణ రైతును కాంగ్రెస్ టార్గెట్ చేసింది. రాష్ట్ర రైతాంగం బీఆర్ఎస్ పక్షానే ఉన్నదన్న కసి, పగ!
అందుకే కేసీఆర్ను కొట్టాలంటే ముందు రైతును కొట్టాలని చూస్తున్నది.
పదేండ్లలో తెలంగాణలో వచ్చిన సాగువిప్లవంతో రైతు సంతోషంగా ఉన్నాడు. వ్యవసాయం కళకళలాడుతున్నది. 24గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్తు, రైతుబంధు పెట్టుబడిసాయం, రైతుబీమాతో భరోసా, ధరణితో భూములకు భద్రత, క్షణాల్లో రిజిస్ట్రేషన్, రెవెన్యూ ప్రక్షాళన, చెరువుల పునరుద్ధరణ, సకాలంలో నాణ్యమైన విత్తనాలు, నకిలీ సీడ్స్పై పీడీ, అందుబాటులోకి ఎరువులు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కాళేశ్వరం-పాలమూరు నిర్మాణం, పంటపొలాలకు నీళ్లు, ధాన్యం కొనుగోళ్లు, కల్లాల నిర్మాణం.. ఒక్కటేమిటి, రైతుకోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేసింది.
అదే కాంగ్రెస్ భయం.. అందుకే అరచేతిని అడ్డుపెట్టాలని చూస్తున్నది!
కేసీఆర్ ప్రభుత్వం సాగు బలోపేతానికి, రైతు సంక్షేమానికి అంకితమైంది. ఫలితంగా తెలంగాణ దేశానికి అన్నంగిన్నెగా మారింది. తెలంగాణ సేద్యపు అద్భుతాలు అంతర్జాతీయ యవనికపై ఆవిష్కృతమయ్యాయి.
అదే కాంగ్రెస్ భయం.. తెలంగాణ పరుగుకు మోకాలడ్డాలని ప్రయత్నిస్తున్నది!
తెలంగాణ గుండెపై దెబ్బకొట్టేందుకు 2 నెలలుగా కాంగ్రెస్ గులేర్ పట్టుకుని తిరుగుతున్నది. మొదట 3గంటల కరెంటన్నారు. 10హెచ్పీలు మోటర్లన్నారు. ధరణి దుబారా అన్నారు. రైతుబంధు సాయం ఆపాలని ఫిర్యాదు చేశారు. ఈసీ అనుమతిస్తే.. మళ్లీ అడ్డుకున్నారు. రైతు నోటికాడ బుక్కను ఎత్తగొట్టారు.
కానీ ఒక్కటి మాత్రం నిజం! రైతుబంధును ఆపగలరేమో కానీ రైతుబాంధవుడిని ఆపగలరా?ఔర్ ఏక్ ధక్కా.. అంతే!
అక్టోబరు 23న ఠాక్రే ఫిర్యాదు
రైతు బంధు, దళిత బంధుపై చర్యలు తీసుకోవాలంటూ ఎలక్షన్ కమిషన్కు ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే అక్టోబర్23న రాసిన లేఖ
అక్టోబరు 26న ఈసీ ఆదేశం
రైతులకు రైతుబంధు సాయం విడుదల చేయవద్దంటూ ఎన్నికల కమిషన్ అక్టోబర్ 26న జారీ చేసిన ఆదేశాలు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి సమగ్రంగా జవాబులు పంపించింది. రైతుబంధు విడుదలకు అనుమతివ్వాలని కోరింది.
నవంబర్ 24న ఈసీ సడలింపు
అక్టోబర్ 5న ఇచ్చిన మార్గదర్శకాలనుఅనుసరించినవంబర్ 24న రైతుబంధు పంపిణీ చేసుకోవడానికి అనుమతిస్తూ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఆదేశం.
నవంబర్ 25న రేవంత్
రైతు బంధు పంపిణీకి ఈసీ ఎలా అనుమతిస్తుందంటూ నవంబర్ 25న మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్
నవంబర్ 26న ఈసీకి రేవంత్ !
రైతు బంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ నవంబర్ 26న ఎన్నికల కమిషన్కు రేవంత్ రాసినట్టుగా వైరల్ అయిన లేఖ
నవంబర్ 27న ఈసీ నిలిపివేత
రైతు బంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 27న జారీ చేసిన ఆదేశం