హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కేసులపై ఆందోళన వద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉంటే చాలని ఆర్థిక, ద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కొత్త వేరియంట్ల కేసులు పెరుగుతున్నందున సోమవారం హైదరాబాద్లో ఆయన వైద్యాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అన్ని విభాగాల వైద్యాధికారులతో చర్చించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రాష్ర్టాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి కొవిడ్ లక్షణాలు ఉన్న వారు సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కొవిడ్ వ్యాక్సినేషన్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ముఖ్యంగా ప్రికాషన్ డోసు పంపిణీలో మొదటి స్థానంలో ఉన్నదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7.75 కోట్ల డోసులను పంపిణీ చేశామని చెప్పారు. 1.35 కోట్ల ప్రికాషన్ డోసులు అందించామని, మరో 1.62 కోట్లు పంపిణీ చేయాల్సి ఉన్నదని అన్నారు. అర్హులైన ప్రతి ఒకరూ టీకాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరానికి సరిపడా డోసులు కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయడం లేదని అన్నారు. మరిన్ని డోసులు ఇవ్వాలని లేఖ రాయాలని ఆదేశించారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఈ రమేశ్రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.