హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): కరోనా టీకాలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని, కచ్చితంగా రెండు డోసులు వేసుకోవాలని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొవిడ్ అదుపులోనే ఉన్నదని, ఇప్పటివరకు 75% మందికి మొదటి డోస్ పూర్తయిందని, 39 శాతం మందికి రెండో డోస్ కూడా వేశామని తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఒకటి రెండు రోజుల్లో 3 కోట్ల డోసుల మార్కు దాటుతుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 లక్షల డోసులు నిల్వ ఉన్నట్టు వెల్లడించారు. కరోనా తీవ్రత తగ్గడంతో ప్రజల్లో కొంత నిర్లక్ష్యం కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. టీకాలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే ముప్పు తప్పదని, కొత్త వేరియంట్లు వచ్చే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. రెండు డోసులు తీసుకున్నవారు కరోనా నుంచి 99 శాతానికిపైగా రక్షణ పొందుతున్నారని, కేవలం 0.4% మందికి మాత్రమే పాజిటివ్ వస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఇంకా దాదాపు 69 లక్షల మంది ఒక డోస్ కూడా తీసుకోలేదని, 36.35 లక్షల మంది రెండో డోస్ తీసుకోవాల్సి ఉన్నదని చెప్పారు. వీరంతా వెంటనే సమీపంలోని టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.
త్వరలో చిన్నారులకూ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని, దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉన్నదని శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే కేంద్రం జైడస్ క్యాడ్లా వ్యాక్సిన్కు అనుమతి ఇచ్చిందని, దీన్ని 2 నుంచి 18 ఏండ్లలోపు వారికి వేయవచ్చని చెప్పారు. కొవాగ్జిన్ సైతం అనుమతుల కోసం ఎదురుచూస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది పిల్లలకు వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ 100% పూర్తి చేసేందుకు వైద్యారోగ్యశాఖ నోడల్ ఆఫీసర్లను నియమించింది. ఉమ్మడి జిల్లాకు ఒకరిని చొప్పున మొత్తం 10 మంది అధికారులను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వ్యాక్సినేషన్పై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, సెకండ్ డోస్ పంపిణీపై దృష్టిసారించనున్నారు.
వ్యాక్సిన్ తీసుకోనివారిలో : 60 శాతం
ఒక్కడోస్ తీసుకున్నవారిలో : 30 శాతం
రెండు డోసులు తీసుకుంటే : 0.4 శాతం