అంబర్పేట, నవంబర్ 11: మాదిగ జాతిని మంద కృష్ణమాదిగ బీజేపీకి తాకట్టు పెట్టారని రాష్ట్ర దళిత సంఘాల ఐక్య వేదిక ఆరోపించింది. వేదిక అధ్యక్షుడు పీ గెల్వయ్య, ఉపాధ్యక్షులు ఆర్కే బాబు, గాలపల్లి శంకర్, జాకీ, జిల్లా అధ్యక్షుడు రెడపాక రాము, సహాయ కార్యదర్శి మేది ప్రసాద్, భీష్మాదేవ్, పాండు రంగం, క్రాంతి, సతీశ్ తదితరులు శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీని తీసుకొచ్చి సభ పెట్టడం తగదని హితవుపలికారు. మోదీ, మందకృష్ణ మాదిగ మాటలను ఎవరూ నమ్మొద్దని సూచించారు. స్వాతంత్య్ర భారతంలో మాదిగలకు అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ను ఏర్పాటు చేస్తే అన్ని దళిత సం ఘాలు మద్దతు తెలిపాయని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు వాగ్దానా లు చేసి చివరికి దళితులను మోసం చేస్తున్నాయని, మోసంలో భాగంగానే మోదీ సభను పెట్టారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే దళితులపై అధికంగా దాడులు, లైంగికదాడులు జరుగుతున్నాయని, అలాంటి పార్టీకి చెందిన మోదీ మాదిగలకు న్యాయం చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. దళితుల ఓట్లు మళ్లించడం కోసం మోదీ మాదిగల విశ్వరూప సభను పెట్టారని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసి పార్లమెంటుకు పంపినట్టు గుర్తు చేశారు. దళిత బాగోగులు చూస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతి దళితబిడ్డ మద్దతు తెలపాలని, గెలుపులో భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు.