కరీంనగర్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ బతికి ఉండగా, కేంద్రం తెస్తున్న ఒత్తిడికి తలొగ్గి రైతుల కరంట్ మోటర్లకు మీటర్లు పెట్టనీయరని మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం దేశంలోని అనేక రాష్ర్టాలు రైతుల కరంట్ మోటర్లకు మీటర్లు పెడుతున్నారని, ఆంధ్రప్రదేశ్లో కూడా మీటర్లు బిగిస్తున్నారని, సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో అందుకు సమ్మతించరని చెప్పారు. గురువారం హుజూరాబాద్ మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్తో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల కోసం తమ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరంట్, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఏడాదిలో రెండు పంటలకు నీళ్లు ఇస్తున్నదని, ఆసరా పింఛ న్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ల వంటి పథకాలను అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. అదే కేంద్రంలోని బీజేపీ నల్ల చట్టాలు తెచ్చి రైతులను రోడ్డుపైకి లాగిందని, ఈ చట్టాలను రద్దు చేయాలని ఏడాదిగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రులు కార్లు ఎక్కించి చంపుతున్నారని, వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్, మంచి నూనె లాంటి నిత్యవసరాల ధరలు పెంచి సామాన్యులు బతకలేని స్థితిని కల్పిస్తున్నదని మండిపడ్డారు. ఇలాంటి పార్టీకి ఓట్లు ఎలావేస్తారని ప్రశ్నించారు.
స్వార్థం కోసమే ఈటల రాజీనామా
రైతులకు రూ.లక్ష లోపు రుణ మాఫీ చేస్తున్నామని, ఇప్పటికే రూ.25 వేలు, రూ.50 వేల వరకు రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేశామని, వచ్చే ఫిబ్రవరి, మార్చిలోగా మిగతా మొత్తాన్ని వడ్డీతో సహా రద్దుచేస్తామని హరీశ్రావు చెప్పారు. రాజేందర్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిం దో ఒక్కసారి ఆలోచించాలని కోరారు. హుజూరాబాద్ను ప్రత్యేక జిల్లాగా గుర్తించాలనో, ఇక్కడికి ప్రభుత్వ వైద్య కళాశాల కావాలనో, మరో ప్రజా సమస్య కోసమో ఆయన రాజీనామా చేయలేదని తెలిపారు. స్వార్థం కోసం రాజీనామా చేశారని, స్వార్థం కోసం హుజూరాబాద్ ప్రజలు బలైపోయినా పర్వాలేదనే ధోరణిలో ఉన్నారన్నారు. మంత్రిగా ఉండి ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టివ్వలేని అసమర్థుడు రాజేందర్ అని దుయ్యబట్టారు. ఇక్కడ కేసీఆర్ ఆదేశాల మేరకు జరుగుతున్న పనులన్నీ తన రాజీనామాతోనే వస్తున్నాయని చెప్పుకుంటున్నారని, మంత్రిగా ఉన్న ఏడేండ్లలో ఆయనకు చేసే అధికారం ఉన్నా చేయలేని పనులన్నింటినీ ఇప్పుడు తాము వచ్చి చేస్తున్నామని చెప్పారు. ఇంకా రెండున్నరేండ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, ప్రజల అవసరాలు తీరాలంటే అధికార పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే జిమ్మేదారి తనదని హామీ ఇచ్చారు. దేశం గర్వించేలా సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశ పెట్టి, పేదల కడుపు నింపుతుంటే, రైతులకు వెన్ను దన్నుగా నిలుస్తుంటే, ఈటల మాత్రం ఈ పథకాలు వద్దని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుబంధు వద్దని మైకులు పట్టుకుని చెప్పే రాజేందర్, ఆయన మాత్రం సీజన్కు రూ.10.50 లక్షలు తీసుకుంటున్నారని గుర్తుచేశారు.
నాకు ఆడో ఇల్లు ఈడో ఇల్లు లేదు: గెల్లు
ఐదేండ్లు అధికారంలో ఉండి సేవ చేయాలని ఈటలకు ఓటు వేసి గెలిపిస్తే స్వార్థం కోసం రాజీనామా చేశారని గెల్లు శ్రీనివాస్ మండిపడ్డారు. తనకు అక్కడో ఇల్లు, ఇక్కడో ఇల్లు లేదని, హుజూరాబాద్లోనే ఉంటానని, ఎవరికి కష్టమొచ్చి ఫోన్ చేసినా ఇంటికి వచ్చి పనులు చేస్తానని చెప్పారు. తాను గెలిస్తే ఇంకో 5 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు తెస్తానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఆశీర్వాదంతో హుజూరాబాద్కు మెడికల్ కళాశాలను తెస్తానని హామీ ఇచ్చారు.
అబద్ధాలు ప్రచారం చేస్తున్నానని నాపై నిందలు వేస్తున్నావు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలనే నేను ప్రచారం చేస్తున్నాను. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న ధరల గురించి కూడా చెప్తున్నాను. ఇవి అబద్ధాలైతే, హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలోని శివాలయం వద్ద మాట్లాడుదాం రా. దమ్ముంటే ఈటల అక్కడికి రావాలి.