హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో హరీశ్ రావును అరెస్టు చేయవద్దని హైకోర్టు (High Court) ఆదేశించింది. అరెస్టు మినహా తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. దర్యాప్తునకు సహకరించాలని హరీశ్రావుకు సూచించింది. హరీశ్పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత చక్రధర్గౌడ్కు నోటీసులు జారీసింది. విచారణను వాయిదావేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న హరీశ్ రావును అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సిద్దిపేట కాంగ్రెస్ ఇన్చార్జి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీశ్రావుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో హరీశ్రావు పిటిషన్ దాఖలు చేశారు.
పంజాగుట్ట పీఎస్లో తనపై తప్పుడు కేసు నమోదు చేశారని అందులో పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్పై ముందుకు వెళ్లకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. ఈనేపథ్యంలో హరీశ్ రావును అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది.
చక్రధర్ తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందంటూ గతంలోనే హరీశ్రావుపై కేసు పెట్టారు. తన ఫోన్ను ట్యాపింగ్ చేశారంటూ నిరుడు ఆగస్టు 29న తనకు ఆపిల్ కంపెనీ నుంచి మెయిల్ వచ్చిందని ఈ ఏడాది జూన్ 19న డీజీపీకి ఫిర్యాదు చేశారు. తర్వాత పోలీసులు పట్టించుకోవడం లేదని హైకోర్టును ఆశ్రయించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హరీశ్రావును ప్రతివాదులుగా చేర్చుతూ జూలై 16న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత నవంబర్ 22న చక్రధర్ తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. మళ్లీ ఇదే అంశంపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చక్రధర్కు హరీశ్పై అనుమానం ఉంటే రిట్ పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. హరీశ్రావు సోమవారం సీఎం రేవంత్రెడ్డి ద్వంద్వ నీతిని వీడియో ఆధారాలతో సహా బయటపెట్టిన నేపథ్యంలోనే కక్షతో మంగళవారం కొత్తగా కేసు నమోదు చేయించారని ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీశ్పై నాలుగు కేసులు నమోదయ్యాయి. రైతులకు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని రేవంత్రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిపై ఒట్టేసి మాట తప్పారని హరీశ్రావు ఆగ స్టు 22న యాదగిరిగుట్ట ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. దీంతో ఆయనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రెం డో కేసు ఈ ఏడాది అక్టోబర్ 4న సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో నమోదైంది. మంత్రి కొండా సురేఖకు బీజేపీ ఎంపీ రఘునందన్రావు నూ లుపోగు దండ వేయడంపై ఓ వ్యక్తి సోషల్ మీ డియాలో పోస్ట్ పెట్టాడు. నిందితుడి సోషల్ మీ డియాలో హరీశ్ ఫొటో కనిపించిందనే సాకుతో కేసు నమోదు చేశారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మూడో కేసు ఈ ఏడాది అక్టోబర్ 25న బేగంబజార్లో నమోదైంది. హామీలను ఎగవేస్తున్నందుకు సీఎం రేవంత్రెడ్డిని ‘ఎగవేతల రేవంత్రెడ్డి’ అని సంభోదించినందుకు హరీశ్పై కేసు నమోదు చేశారు. నాలుగో కేసు కరీంనగర్లో నవంబర్ 25న నమోదైంది. ఓ కార్యక్రమంలో రేవంత్రెడ్డిని విమర్శించారన్న కారణంతో కేసు నమోదు చేశారు.