జనగామ చౌరస్తా, జనవరి 11: జనగామ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శేపూరి ప్రశాంత్ గురువారం ఏసీబీకి చిక్కారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఎండీ అజార్ ద్వారా ఔట్సోర్సింగ్ మహిళా ఫార్మసిస్ట్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. కాముని స్రవంతి జనగామ మండలంలోని ఓబుల్ కేశవాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్సోర్సింగ్ ఫార్మసిస్ట్గా మూడేండ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నది. 2023 అక్టోబర్లో రెగ్యులర్ ఫార్మాసిస్టు విధుల్లో చేరగా.. స్రవంతిని రఘునాథపల్లి పీహెచ్సీకి మార్చారు. అక్కడ వారం రోజులపాటు పనిచేసిన స్రవంతిని ఉన్నఫళంగా విధుల నుంచి తొలగించారు.
తనను ఉద్యోగం నుంచి తొలగించొద్దని డీఎంహెచ్వో డాక్టర్ ప్రశాంత్ను వేడుకున్నది. ఔట్సోర్సింగ్ ఉద్యోగంలో కొనసాగాలన్నా, 2 నెలల వేతనం చెల్లించాలన్నా రూ.లక్ష లంచం ఇవ్వాలని జూనియర్ అసిస్టెంట్ అజార్ ద్వారా డీఎంహెచ్వో డిమాండ్ చేశారు. చేసేదిలేక స్రవంతి వరంగల్ ఏసీబీ అధికారులను సంప్రదించింది. వారి ప్లాన్ ప్రకారం.. వారం కిందట రూ.50 వేలు ఇచ్చిన స్రవంతి.. తాజాగా రూ.50 వేల నగదును డీఎంహెచ్వో ప్రశాంత్, జూనియర్ అసిస్టెంట్ అజార్ ముందే స్రవంతి డీఎంహెచ్వో చాంబర్లోని టేబుల్ డ్రాలో పెడుతున్న క్రమంలో ఏసీబీ అధికారులు ఇద్దరినీ పట్టుకున్నారు. నిందితులను శుక్రవారం హైదరాబాద్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వివరించారు.