మహబూబ్నగర్ అర్బన్, ఏప్రిల్ 24: ఓట్ల కోసం ఒట్టు రాజకీయాలా..? ఇదెక్కడి నీచ రాజకీయమంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. బుధవారం మహబూబ్నగర్లోని ఆమె స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమలుకాని హామీలు గుప్పించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, వాటిని అమలు చేయలేక చేతులెత్తేసి ఇప్పుడు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్ దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారన్నారు. ఆగస్టులోగా రుణమాఫీ అంటూ రైతులను మభ్యపెట్టేందుకు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోసకారికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.