కల్వకుర్తి రూరల్, జనవరి 20 : భూ సర్వేకు సంబంధించిన రిపోర్టు ఇవ్వడానికి లంచం తీసుకుంటూ సర్వేయర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది. ఏసీబీ మహబూబ్నగర్ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ తెలిపిన వివరాల మేరకు.. కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం లింగారెడ్డిపల్లికి చెందిన సిరాజ్ తన భూమిని కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న డివిజన్ సర్వేయర్ వశ్యానాయక్తో సర్వే చేయించారు.
భూమి కొలతలకు సంబంధించిన రిపోర్ట్ ఇవ్వాలని కోరగా వశ్యా నాయక్ రూ.10 వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.8 వేలకు ఒప్పందం కుదిరింది. శనివారం సాయంత్రం సర్వేయర్ వశ్యానాయక్కు రూ.8 వేలు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ తెలిపారు.