హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యులుగా తెలంగాణ పబ్లికేషన్స్ సీఎండీ దీవకొండ దామోదర్రావు, హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి ఏకగ్రీవం అయ్యారు. గత నెల 25న టీఆర్ఎస్ అభ్యర్థులుగా వీరిద్దరూ దాఖలు చేసిన నామినేషన్లు సరైనవి అని బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి గుర్తించారు. మరో ఇద్దరు అభ్యర్థులు శ్రమశక్తి పార్టీ తరఫున జాజుల భాస్కర్, భోరజ్ కోయల్కర్ దాఖలు చేసిన నామినేషన్లను ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ప్రతిపాదించకపోవటంతో అవి తిరస్కరణకు గురయ్యాయి. ఉన్న రెండు నామినేషన్లు దీవకొండ దామోదర్రావు, పార్థసారథిరెడ్డివే కావటంతో వీరు ఏకగ్రీవం అయ్యారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. అనంతరం ఎన్నికల సంఘం వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించి, ధ్రువపత్రాలను అందజేస్తుంది.