హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కలవరపెడుతున్నాయి. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో సాధారణం కన్నా 25 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సాధారణంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ, ఈ ఏడాది ఆలస్యంగా మూడో వారంలో ప్రవేశించాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 19.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 13.49 సెంటీమీటర్లు నమోదైంది. రాష్ట్రంలో 23 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, మెదక్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనా అది జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. మిగతా జిల్లాల్లో లోటు, అత్యంత లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో విత్తనాలు విత్తడం లేదని అధికారులు తెలిపారు. ఈ సీజన్లో 124.28 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా, నాలుగో వంతు మాత్రమే నాట్లు వేసినట్టు వివరించారు. కృష్ణానదిపై ఉన్న రెండు ప్రధాన రిజర్వాయర్లలో సాగునీటి మట్టాలు ఆశాజనకంగా లేకపోవటం, వర్షాలు కురవకపోటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.