రాజన్న సిరిసిల్ల : అవినీతి నిరోధక శాఖ అధికారులకు అవినీతి చేప చిక్కింది. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామానికి చెందిన భూక్యా సరిత టిప్పర్ సబ్సిడీ కోసం కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్కు దరఖాస్తు చేసుకోగా.. అప్లికేషన్ సరితకు అనుకూలంగా పంపడానికి 30 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు.
దీంతో బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వారి సూచనల మేరకు 17వేల రూపాయలు ఈనెల 26న ఉపేందర్రావుకు అందజేశారు. సోమవారం మిగతా 13,000 రూపాయలు సరిత మరిది భూక్య శివకుమార్ వద్ద పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ గితానగర్లో తీసుకుంటుండగా ముందుగా పన్నిన పథకం ప్రకారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితున్ని ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ వి.వి రమణమూర్తి తెలిపారు. ఏ అధికారైన అవినీతికి పాల్పడితే 9154388954 సంప్రదించాలని సూచించారు.