హైదరాబాద్: తెలంగాణ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు అనుగుణంగా కొత్త డిస్ట్రిక్ట్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన జూన్ 2వ తేదీ నుంచి ఈ కోర్టులు పనిచేయనున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పది జిల్లాల్లోనే డిస్ట్రిక్ట్ కోర్టులు ఉండేవి. ప్రభుత్వం పాలనా సంస్కరణల్లో భాగంగా కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాల సంఖ్య 33కి పెరిగాయి. అన్ని జిల్లాల కోర్టులకు జడ్జీలను నియమిస్తూ గతంలోనే ఉత్తర్వులను వెలువరించింది.
రాష్ట్రావతరణ వేడుకల్లో భాగంగా జూన్ 2వ తేదీన ఉదయం పది గంటలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే కొత్త జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కోర్టులు కూడా పనిచేయనున్నాయి. పాలనా సంస్కరణల్లో భాగంగా జిల్లాలను 33కు పెంచిన రాష్ట్రాధినేత కేసీఆర్ ప్రత్యేకంగా తీసుకున్న చొరవ ఫలితంగా కొత్త డిస్ట్రిక్ట్ కోర్టులు ఏర్పాటయ్యాయి.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్రశర్మను సీఎం కేసీఆర్ స్వయంగా కలిసి చేసిన వినతి మేరకు కొత్త జిల్లా కోర్టులు ఏర్పాటయ్యాయి. న్యాయ చరిత్రలో ఒకేసారి 23 కొత్త జిల్లాల కోర్టులు ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. కొత్త జిల్లా కోర్టుల ఏర్పాటుతో కింది స్థాయిలో కేసుల విచారణ వేగవంతం అవుతుంది. సత్వర న్యాయం జరుగుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టులకు భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. హైకోర్టు కూడా జిల్లాలకు పోర్టుపోలియో జడ్జీలను నియమించింది. హైకోర్టు న్యాయమూర్తులను ఆయా జిల్లాలకు పోర్టుపోలియో జడ్జీలుగా అపాయింట్ చేసింది.