పెద్దపల్లి, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): సకల జనుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎస్సీ అభివృద్ధి వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం పెద్దపల్లిలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యూనిట్ల పంపిణీ, కలెక్టరేట్లో బీసీ కుల వృత్తుల వారికి రూ.లక్ష చొప్పున సాయం, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులరైజేషన్ పత్రాల పంపిణీ, రామగుండంలోని ఎన్టీపీసీ మిలీనియం హాల్లో జడ్పీ సర్వసభ్య సమావేశానికి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు నిర్మించుకునే విధంగా రూ.3 లక్షల చొప్పున గృహలక్ష్మి సాయాన్ని అందిస్తున్నదని చెప్పారు. ఇందులో భాగంగా నియోజక వర్గానికి 3 వేల ఇండ్లు మంజూరైనట్టు తెలిపారు.