హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లోని రిహాబిలిటేషన్ సెంటర్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ దివ్యాంగ అభ్యర్థులకు 12 రకాల పుస్తకాలను పంపిణీ చేసినట్టు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా దివ్యాంగుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని కొనియాడారు.
రూ.55లక్షల ఖర్చు పెట్టి పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణతో పాటు ఉచితంగా మెటీరియల్ను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. అనంతరం ఘట్కేసర్కు చెందిన దివ్యాంగుడు యాదగిరికి సబ్సిడీ రుణం కింద రూ.50వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి డీడబ్ల్యూవో మోతి, వికలాంగుల సంఘాల నాయకులు నారా నాగేశ్వరరావు, పల్లెబోయిన సుధాకర్వర్మ తదితరులు పాల్గొన్నారు.