హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సింగరేణి కార్మికులకు బుధవారం జాతీయ జెండాలను పంపిణీ చేస్తామని సంస్థ జీఎంలు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరామ్, డీ సత్యనారాయణ, కే సూర్యనారాయణ తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో వజ్రోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్మికులు తమ ఇండ్లపై ఎగురవేసేందుకు 70 వేల జాతీయ జెండాలను సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ నెల 13 నుంచి 15 వరకు రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలతో పాటు, విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఏరియా జీఎంలు ఆనందరావు, బలవయ్య పాల్గొన్నారు.