మెట్పల్లి, ఫిబ్రవరి 19: ‘ఆయన కారు దిగడు.. కండ్లద్దాలు తీయడు.. ప్రజలను చూడడు..వారితో మాట్లాడడు.. ఈ అహంకారి అర్వింద్ మాకొద్దు.. నియంతకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వద్దు’ అంటూ జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో సోమవారం కరపత్రాల పంపిణీ కలకలం రేపుతున్నది. కరపత్రాలపై స్థానిక బీజేపీ నేతల పేర్లు ఉండటంతో సొంత పార్టీ వారి పనేనని ప్రచారం జరుగుతున్నది. 2019 ఎన్నికల్లో నిజమాబాద్ ఎంపీగా గెలిచిన అర్వింద్కు సొంత క్యాడర్ నుంచే ధిక్కార స్వరం వినిపిస్తున్నది. ఇప్పటికే పలువురు బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి వినతిపత్రాలు అందించగా, మరికొందరు ప్రెస్మీట్లు పెట్టి, దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఇటీవల ఓ కార్యకర్త ఏకంగా ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. మెట్పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం కరపత్రాల పంపిణీ చర్చనీయాంశమైంది.