హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ‘భవిష్యత్తులో అటవీ భూమి ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కాకూడదు. పోడు భూముల పట్టాల పంపిణీ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా అటవీ భూమిని ఆక్రమిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న సంకేతాలు పోవాలి’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇటీవల రాష్ట్ర శాసనసభలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది.
ఈసారి పోడు భూముల పట్టాల పంపిణీ తర్వాత అంగుళం కూడా అటవీ భూమి అన్యాక్రాంతం కాకుండా చూసేందుకు పాలిగన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఏ సర్వే నంబర్లో ఎంత పోడు భూమిని పంపిణీ చేస్తున్నాం? ఆ భూమి ఏ అక్షాంశ, రేఖాంశాల మధ్య ఉన్నది? ఆ భూమి హద్దులేమిటి? అనే అంశాలను గూగుల్ మ్యాపింగ్ చేసి ఆ వివరాలను పోడు పట్టాలో పొందుపరచనున్నారు.
ఆయా పట్టాలపై లబ్ధిదారుల ఫొటోలు, సంతకాలతోపాటు అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల అధికారుల సంతకాలు, హోలోగ్రామ్ ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు. ఈ పట్టాల పంపిణీ తర్వాత భూమి హద్దుల విషయంలో లబ్ధిదారులకు ఇరుగు పొరుగువారితో వివాదాలు తలెత్తకుండా చూసేందుకు, కాలక్రమంలో లబ్ధిదారులు పక్కనే ఉన్న భూములను ఆక్రమించుకోకుండా నిరోధించేందుకు పాలిగన్ టెక్నాలజీ ఎంతో ఉపకరిస్తుందని అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 4 లక్షల ఎకరాలకుపైగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఇటీవల సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణలోని 28 జిల్లాల పరిధిలో 4,00,903 ఎకరాల అటవీ భూములకు పోడు పట్టాలను పొందేందుకు 1,55,393 మంది లబ్ధిదారులు అర్హత సాధించినట్టు సమాచారం. వీరందరికీ సాధ్యమైనంత త్వరగా పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని, సంబంధిత పట్టా పాస్పుస్తకాల ముద్రణ తుది దశలో ఉన్నదని అధికారులు వెల్లడించారు.
పోడు పట్టాల పంపిణీకి కసరత్తు ఇదీ..