Fish Seeds | హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): మత్య్సకారులకు ఆర్థిక భరోసా కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కేసీఆర్ సర్కారు అమలుచేసిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలుపై సందిగ్ధం నెలకొన్నది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందా? లేదా? అన్న సందేహాలు మత్స్యకారవర్గాల్లో తలెత్తుతున్నాయి. ఈ సందేహాలకు ప్రధాన కారణం ఈ పథకంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడమే.
గొర్రెల పథకాన్ని కొనసాగిస్తామని, అందుకు సంబంధించిన హామీని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. కానీ, చేప పిల్లల పంపిణీ పథకం గురించి మ్యానిఫెస్టోలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ పథకం కొనసాగుతుందా? లేదా? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటి వరకు మత్స్యశాఖకు మంత్రి ఎవరూ లేరు. ఈ శాఖ ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి వద్దే ఉన్నది. మార్చి లేదా ఏప్రిల్లో ఈ ఏడాది చేపల పంపిణీకి సంబంధించి చర్యలు ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ అప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఈ శాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడం కూడా ఈ పథకం అమలుపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వంద కోట్లకుపైగా బిల్లులు పెండింగ్
నిరుడు చేపల పంపిణీకి సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ప్రతిసారి నవంబర్ లేదా డిసెంబర్లో ప్రభుత్వం బిల్లులను మంజూరు చేస్తుంది. కానీ ఈసారి ఎన్నికల నేపథ్యంలో గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేకపోయింది. దీంతో సుమారు రూ.104 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి. బిల్లులు విడుదల చేయాలంటూ కాంట్రాక్టర్లు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
నిత్యం మత్స్యశాఖ కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో ఒత్తిడి తట్టుకోలేక బిల్లులను విడుదల చేయాలని పలుమార్లు అధికారులు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సమాధానం రాలేదని సమాచారం. దీంతో అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. బిల్లులు ఆలస్యమైతే కాంట్రాక్టర్ల నుంచి మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది.
33 వేల కోట్ల సంపద సృష్టి
రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో ఏడాదికి 1.5 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి మాత్రమే ఉండేది. అది ఇప్పుడు 4.5 లక్షల టన్నుల నుంచి 5 లక్షల టన్నులకు పెరిగింది. అంటే పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.33 వేల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఈ పథకం ద్వారా గత ఎనిమిదేండ్లలో రూ.520 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం సుమారు రూ.450 కోట్ల చేపపిల్లలు, రొయ్యపిల్లల్ని పంపిణీ చేసింది. ఆ లెక్కన చేసిన ఖర్చుకు ఆరు రెట్ల సంపదను సృష్టించడం గమనార్హం. రాష్ట్రంలోనే చేపపిల్లల ఉత్పత్తి పెరగటంతో ఏపీ, ఇతర రాష్ర్టాల నుంచి చేపల దిగుమతి దాదాపు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో రాజకీయాలతో సంబంధం లేకుండా పథకాన్ని కొనసాగించాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.
గత ఏడాది చేపలు, రొయ్య పిల్లల విడుదల ఇలా..
చేపపిల్లలు : 77 కోట్లు రూ.82 కోట్ల ఖర్చు (23,276 నీటి వనరులు)
రొయ్యపిల్లలు : 9.5 కోట్లు రూ.22 కోట్ల ఖర్చు (394 నీటి వనరులు)
మొత్తం : 86.5 కోట్లు రూ.104 కోట్ల ఖర్చు