పెద్దపల్లి : రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి గని కార్మికులంటే సీఎం కేసీఆర్కు అమితమైన అభిమానమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం రామగుండం రీజియన్-1 పరిధిలోని 11ఏ ఇంక్లయిన్ గని వద్ద కార్మికులకు ఎమ్మెల్యే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, క్యాలెండర్ కార్మికుల అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతూ గని కార్మికుల వారసులకు కారుణ్య నియామకాలు తిరిగి కల్పించి, కార్మికుల కళ్లల్లో ఆనందం నింపుతున్న ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ సందర్భంగా రామగుండానికి మెడికల్ కళాశాల మాంజూరు చేసినందుకు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
సమైక్య పాలనలో సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక సింగరేణిలో గత పాలకులు పోగోట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి కారుణ్య నియమాకాలతో 16 వేల మందికి సింగరేణిలో ఉద్యోగాలు కల్పించిన మహానేత అన్నారు. సమైక్య పాలైనలో ఉన్న సీఎంలను కలిసేందుకు సింగరేణి కార్మిక సంఘాల నేతలకు అవకాశం లేకుండా పోయేదని, సీఎం కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నాక ప్రత్యేకంగా కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ ద్వారా కార్మిక హక్కులు సాధించామన్నారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శనీయమన్నారు.