Bathukamma Sarees | హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ చీరలను బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే 80% చీరలు పంపిణీ కేంద్రాలకు చేరాయి. ఈ ఏడాది రూ.354 కోట్ల వ్యయంతో చేనేత సంఘాల ఆధ్వర్యంలో 1.02 కోట్ల చీరలను సిద్ధంచేశారు. జరీతోపాటు వివిధ రంగుల కాంబినేషన్తో 250 డిజైన్లలో ఆకర్షణీయంగా చీరలను తయారుచేయించారు. 2017 నుంచి 2022 వరకు 5.81 కోట్ల చీరలను ఆడబిడ్డలకు అందించారు. విశ్వవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ వేడుకలు ప్రతీకగా నిలిచాయి. మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగకు ఆడబిడ్డలందరూ కొత్త చీరలు ధరించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల తదితర ప్రాంతాల్లోని నేతన్నలతో వీటిని తయారు చేయిస్తున్నారు. బతుకమ్మ పండుగ సమీపిస్తుండటంతో రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు ఈ నెల 4 నుంచి చీరలను పంపిణీ చేసేందుకు టెస్కో, తెలంగాణ హ్యాండ్లూమ్స్శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఏటా సుమారు ఒక కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తుండగా, ఈ ఏడాది కూడా 1.02 కోట్ల చీరలను తయారుచేయించారు. చౌకధర దుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జరీతోపాటు 250 డిజైన్లలో చీరలు
గతంలో కన్నా మరిన్ని ఎక్కువ డిజైన్లు, రంగులు, వెరైటీల్లో చీరలను టెక్స్టైల్ శాఖ తయారుచేయింది. జరీతోపాటు వివిధ రకాల కలర్ కాంబినేషన్తో 250డిజైన్లలో చీరలను తయారు చేయించినట్టు అధికారులు తెలిపారు. వివిధ రకాల ఆకర్షణీయ రంగులు, థ్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచులు)తో 100 శాతం పాలిస్టర్ ఫిలిమెంట్ నూలు చీరలను తమ శాఖ తయారు చేసిందని పేర్కొన్నారు. ఆరు మీటర్ల (5.50+1.00) పొడవుగల సాధారణ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్ల పొడవుగల చీరలు కూడా తయారు చేయించామన్నారు.