మణికొండ, సెప్టెంబర్ 15: రేపటి పౌరుల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నదని వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రంగారెడ్డి జిల్లా నార్సింగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు మందులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు తల్లిదండ్రులకు దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని సూచించారు. పిల్లలు కొన్నిసార్లు తినమంటే ఆకలి కావడం లేదంటారని, తరచూ విరేచనాలు చేసుకుంటారని చెప్పారు.
తిండి తినక బరువు తగ్గిపోతుంటారని, రక్తం తగ్గిపోయి బలహీనంగా కన్పిస్తుంటారని తెలిపారు. దీనికి నులిపురుగులే కారణమమన్నారు. 1 నుంచి 19 ఏండ్లలోపు పిల్లలపై నులిపురుగులు తీవ్ర ప్రభావం చూపుతాయని, తినే ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులే పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోయి రోగాల బారిన పడతారని వివరించారు. అపరిశుభ్రత వల్లే నులిపురుగులు పిల్లలకు సంక్రమిస్తాయన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కాలేజీలు, కమ్యూనిటీ భవనాల్లో 1-19 ఏండ్ల పిల్లలకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ అందజేస్తారని చెప్పా రు.
రాష్ట్రవ్యాప్తంగా 98,97, 600 మంది చిన్నారులకు ఒక్కరోజు లక్ష్యంగా పెట్టినట్టు తెలిపారు. తెలంగాణ రాకముందు గురుకులాలపై రూ.380 కోట్లు ఖర్చు చేస్తే, స్వరాష్ట్రంలో రూ.3,300 కోట్లు ఖర్చు చేస్తూ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. గురుకులాల్లో కాంట్రాక్టు పోస్టులను త్వరలోనే రెగ్యులర్ చేస్తామని, ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి తదితరులు పాల్గొన్నారు.