హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీ మేడిపండులా మారింది. పైపైన బాగానే అనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం గ్రూపు రాజకీయాలు, కోవర్టులు, అసంతృప్తులతో నిండిపోయింది. కొత్త నేతలకే ప్రాధాన్యమిస్తూ తమను పట్టించుకోవడం లేదని సీనియర్లు గుర్రుగా ఉండగా.. పాత నేతలు తమ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని కొత్త నేతలు అసంతృప్తితో ఉన్నారు. కార్యకర్తలతో కలువనివ్వడం లేదని, పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వట్లేదంటున్నారు. పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియంతృత్వ పోకడ పెరిగి పోతున్నదని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ‘తెలంగాణలో బీజేపీ అంటే బండి సంజయ్ మాత్రమే గుర్తు రావాలి’ అన్నట్టు వ్యవహరిస్తూ, అందరినీ తొక్కేస్తున్నారని అంటున్నారు. కేంద్ర క్యాబినెట్ మంత్రి కిషన్రెడ్డి ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు తాను ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఈటలకు ఢిల్లీలో పరపతి పెరుగుతుండటం పట్ల బండి గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
మేము ‘ఏటీఎం’లమా?
తమను ఏటీఎంల మాదిరి వాడుకుంటున్నారని కొత్త నేతలు వాపోతున్నారు. పార్టీలో చేరిననాటి నుంచే వసూళ్లు మొదలవుతున్నాయని, సభలు.. సమావేశాల పేరుతో డబ్బు గుంజుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ఖర్చులో అత్యధికశాతం కొత్త నేతల నుంచే వసూలుచేశారని అంటున్నారు. బీజేపీలో చేరిన మాజీ ఎంపీ..తన సన్నిహితుల వద్ద ‘నన్నో ఏటీఎంలా వాడుకుంటున్నార’ని వాపోయినట్టు సమాచారం. తనను ఒక నియోజకవర్గానికే పరిమితం చేశారని, హైదరాబాద్లో జరిగే సభలు, సమావేశాలకు తనను పిలువటం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారట. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా ఖర్చంతా తనమీదే వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.
మూడు ముక్కలాట
రాష్ట్రంలో బీజేపీ అంటే బండి సంజయ్ పేరు మాత్రమే వినబడాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకు అడ్డుగా వచ్చే నేతల ప్రాధాన్యం తగ్గించడంపై ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. కేంద్రమంత్రి కిషన్రెడ్డికి రాష్ట్రంలో పెద్దగా పలుకుబడి లేకున్నా అధిష్ఠానం అండదండలు గట్టిగా ఉన్నాయి. దీంతో ఆయనను పరోక్షంగా దెబ్బతీసేందుకు బండి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రిగా విఫలమయ్యారని, ఢిల్లీలో ఆయనను పట్టించుకొనేవారే లేరని, ఆయనకు ఉన్న మూడు శాఖల్లో ఒక్క అధికారి కూడా మాట వినడం లేదని ప్రచారం చేయిస్తున్నట్టు సమాచారం. దీంతో కిషన్రెడ్డి ఆత్మరక్షణలో పడిపోయారని, తన శక్తిని నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అభిమానులు చెప్తున్నారు.
బీసీ వర్గాల్లో బలమైన నేతగా ఈటల తెరమీదికి రావడం బండి.. అస్సలు సహించడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఈటలను తెరమీదికి రాకుండా చేయడానికి ఎంత ప్రయత్నించినా.. అధిష్ఠానం వద్ద ఈటల ప్రాధాన్యం పెరగటంతో ఆశ్చర్యపోతున్నట్టు తెలిసింది. ఇటీవల ఈటల నేరుగా వెళ్లి అమిత్షాను కలువటంతో బండి ఇంకా రగిలిపోతున్నట్టు తెలిసింది.
మరో ఎమ్మెల్యే రాజాసింగ్ను బండి సంజయ్ పావుగా వాడుకుంటున్నారన్న విమర్శ ఉన్నది. రఘునందన్రావు, ఈటలను దెబ్బకొట్టేందుకు కొంతకాలం క్రితం వరకు రాజాసింగ్కు ప్రాధాన్యమిచ్చారని, ఇటీవల అంతర్గత సమావేశాల్లో రాజాసింగ్ ఒక్కడినే వేదిక మీద కూర్చొబెట్టుకోవడం ఇందులో భాగమేనని చెప్తున్నారు. అయినా వారిద్దరి ప్రాధాన్యం తగ్గకపోవడంతో రాజాసింగ్ను కొన్ని రోజులుగా పక్కన పెట్టినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
స్పష్టంగా రెండు వర్గాలు
క్షేత్రస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు పార్టీ గ్రూపులుగా విడిపోయిందని అంతర్గత వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో పార్టీ బండి సంజయ్, కిషన్రెడ్డి, ఈటల రాజేందర్ వర్గాలుగా విడిపోయిందని చెప్తున్నారు. ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు పరోక్షంగా బురద చల్లుకుంటున్నారని అంటున్నారు. ప్రతి వర్గంలోనూ కోవర్టులు తయారయ్యారన్నారు. జిల్లాల్లోనూ ఇదే సీన్ కనిపిస్తున్నదని పార్టీ నేతలే చెప్తున్నారు. బండి సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకంగా ఒక గ్రూప్ తయారైందని గుర్తు చేస్తున్నారు. సంక్రాంతి సమయంలో బండి వ్యతిరేక వర్గం బహిరంగంగా విమర్శలు చేయడం, ఫిబ్రవరిలో సుమారు 50 మంది కీలక నేతలు హైదరాబాద్లో సమావేశం కావడం వంటివన్నీ ఉదాహరణలుగా చెప్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో డీకే అరుణ, జితేందర్రెడ్డి మధ్య ఆధిపత్య పోరును గుర్తు చేస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల కొత్తగా చేరిన నేతలు ఒక వర్గంగా, పాత నేతలంతా ఒక కూటమిగా ఏర్పడ్డారని, ఒకరినొకరు సహకరించుకోవడం లేదని సమాచారం.
ఎక్కడి నుంచి తేవాలె?
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ సభ రాష్ట్రంలోని కొందరు బీజేపీ నేతలకు తలనొప్పిగా మారింది. వచ్చే నెల 3న జరిగే ఈ సభకు 10 లక్షల మందిని తరలించాలని రాష్ట్ర బీజేపీ భావిస్తున్నది. దీనిలో భాగంగా ప్రతి బూత్ స్థాయి నుంచి కనీసం 30-40 మందిని తరలించాలని టార్గెట్ విధించింది. సభ ఏర్పాట్ల కోసం కనీసం రూ.1,000 చొప్పున విరాళం ఇవ్వాలని బూత్ స్థాయి బీజేపీ అధ్యక్షులను ఆదేశించింది. ఇదేవిధంగా నియోజకవర్గ స్థాయి నేతలకు సైతం భారీ టార్గెట్లు విధించినట్టు తెలుస్తున్నది. హైదరాబాద్ పరిధిలోని ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 10 వేల మంది జనాన్ని, రూ.5 లక్షల చొప్పున డబ్బును సమీకరించాలని నియోజకవర్గ ఇంచార్జీలకు, కార్పొరేటర్లకు స్పష్టం చేసినట్టు సమాచారం.
జిల్లాల్లోని నియోజకవర్గాలకూ ఇలాంటి టార్గెట్లే పెట్టడంతో బీజేపీ నేతలు తలలు పట్టుకొంటున్నారు. మోదీ సభకు ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలివచ్చే పరిస్థితి లేదని, అయినప్పటికీ వారిని ఒప్పించి, పరేడ్ గ్రౌండ్కు తీసుకొచ్చి, తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు వాహనాల చార్జీలు, తిండి ఖర్చు, ఇతర ఖర్చులు కలిపి తడిసి మోపెడు అవుతుందని నేతలు వాపోతున్నారు. ఇవన్నీ ఎవరు ఇస్తారు? ఎక్కడి నుంచి తేవాలని? పై స్థాయి నాయకులను నిలదీస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో బీజేపీకి బూత్ స్థాయి అధ్యక్షులే లేరు. మోదీ సభ నేపథ్యంలో ఇప్పుడు హడావుడిగా బూత్ స్థాయి కమిటీలను వేస్తున్నారు. కొత్తగా వచ్చిన అధ్యక్షులు ‘సభ’ టార్గెట్లతో బెంబేలెత్తుతున్నారు. మరోవైపు లీడర్, క్యాడర్ లేని చోట జనసమీకరణ ఎలా చేయగలమని నియోజకవర్గ నేతలు లబోదిబో మంటున్నారు.