హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటుపడింది. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, మాజీ మంత్రి సీ రామచంద్రయ్యపై అనర్హులుగా ప్రకటిస్తున్నట్టు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు తెలిపారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఈ ఇద్దరూ ఇటీవల పార్టీ మారారు. వంశీకృష్ణ జనసేనలో, రామచంద్రయ్య టీడీపీలో చేరారు.
దీంతో వారిద్దరిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలి కార్యదర్శికి వైసీపీ నేత, మండలిలో చీఫ్విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారికి మండలి చైర్మన్ ఫిరాయింపు నిరోధక చట్టం కింద తొలుత నోటీసులు జారీచేసి, సంతృప్తి చెందక ఇద్దరిపైన అనర్హత ప్రకటించారు. దీంతో వారిద్దరూ తమ పదవులను కోల్పోయారు. ఇటీవల ఎనిమిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపైనా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.