అవి.. 1952లో భాషాప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటులో భాగంగా.. అటు ఇటు కాకుండా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఉండిపోయిన గ్రామాలు. ఇరు రాష్ర్టాల మధ్య భౌగోళికంగా స్పష్టత లేకపోవడంతో 12 గ్రామాలు నేటికీ వివాద గ్రామాలుగానే మిగిలిపోయాయి. ఎక్కడో మూలన విసిరేసినట్టు సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు, అటు మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆ గ్రామాల అభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకోలేదు. ఫలితంగా ఏడు దశాబ్దాలుగా ఆ గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. కనీస అవసరాలైన విద్యుత్తు, తాగునీరు, ఉండటానికి ఇండ్లు లేకుండా అక్కడి ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. వారి బతుకుల్లో వెలుగులు నింపాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా.. నిరంతర విద్యుత్తుతో వెలిగిపోతున్న తెలంగాణ పల్లెల అభివృద్ధి కాంతులను మహారాష్ట్ర సరిహద్దులోని ఆ పల్లెలకూ విస్తరించారు. అంధకారంలో మగ్గుతున్న వివాద గ్రామాలకు విద్యుత్తు సరఫరాను ప్రారంభించారు. అంతేకాదు.. త్వరలోనే అక్కడి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు విద్యుత్తు శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. అలాగే తెలంగాణలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను వివాద గ్రామాల్లోనూ సంపూర్ణంగా అమలు చేస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/కెరమెరి, జనవరి 12: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని వివాద గ్రామాలు అభివృద్ధి బాటపడుతున్నాయి. తెలంగాణ ఏర్పడక ముందు ఇటు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాలను పట్టించుకున్న పాపానపోలేదు. ఇప్పటికీ ఈ గ్రామాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే నిర్లక్ష్యపు ధోరణి అవలంబిస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు ఇక్కడి పల్లెల్లాగే ఈ వివాద గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇక్కడ అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ఆ గ్రామాల్లో కూడా సంపూర్ణంగా అమలు చేస్తున్నది. రూ.78,86,147 ఖర్చు చేసి పరందోలి, ముకుద్దం గూడ గ్రామాల్లో విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం కరంజివాడ గ్రామం నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో పరందోలి, ముకుద్దం గూడ గ్రామాలున్నాయి. ఈ గ్రామాలకు 547 స్తంభాలు వేసి విద్యుత్తు లైన్లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం సుమారు రూ.80 లక్షలు ఖర్చు చేసింది. మహారాష్ట్ర సర్కారు అక్కడక్కడా మొక్కుబడిగా ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియక అవస్థలు పడుతున్నారు. తెలంగాణ సర్కారు ఆ గ్రామాల ప్రజలకు పక్కాగా నాణ్యమైన విద్యుత్తును ఇస్తున్నది. తెలంగాణ సర్కారు చొరవతో పరందోలి గ్రామ పంచాయతీ పరిధిలోని పరందోలి, తండా, కోట, లెండిజాల, ముకుద్దం గూడ పంచాయతీ పరిధిలోని ముకుద్దం గూడ, మహారాజ్గూడ గ్రామాలకు ప్రస్తుతం నిరంతర విద్యుత్తు అందుబాటులోకి వచ్చింది.
ఈ గ్రామాల్లోని రైతులకు త్వరలో ఎవుసానికి కూడా 24 గంటల ఉచిత విద్యుత్తు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు విద్యుత్తు శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడి రైతులు వర్షాధారంపైనే పత్తి, కంది, సోయా వంటి పంటలు పండిస్తున్నారు. ఇక నిరంతర ఉచిత విద్యుత్తు అందుబాటులోకి వస్తే ఏడాది పొడవునా పంటలు పండించే వీలు కలుగుతుందని అక్కడి ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
1952లో భాషాప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటు సమయంలో మహారాష్ట్రలోని తెలుగు మాట్లాడే వారిని ఏపీలో, మరాఠీ మాట్లాడే వారిని మహారాష్ట్రలో కలిపారు. ఆ సమయంలో ఇరు రాష్ర్టాల మధ్య భౌగోళికంగా సరైన స్పష్టత ఏర్పడ లేదు. దీంతో 12 గ్రామాలు నేటికీ వివాద గ్రామాలుగానే మిగిలిపోయాయి. 1996లో ఈ గ్రామాలను ఏపీలో కలపాని అప్పటి ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ అమలు కాలేదు. ఈ తీర్పుని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. దీంతో రెండు రాష్ర్టాల మధ్య ఇవి వివాద గ్రామాలుగానే ఉండిపోయాయి.
తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న పథకాలతోనే మా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నయ్. ఇప్పుడు మా గ్రామాలకు నిరంతర విద్యుత్తు అందుతున్నది. త్వరలోనే మా పొలాల్లో కూడా విద్యుత్తు లైన్లు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్పిన్రు. మహారాష్ట్ర ప్రభుత్వం మా గ్రామాలను పట్టించుకుంటలేదు. మా అభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణలోనే మమ్మల్ని కలపాలని చాలా సార్లు విజ్ఞప్తి చేసినం. అయినా ఎవరూ పట్టించుకుంటలేరు. ఇప్పటికైనా మా గోడు పట్టించుకొని మమ్మల్ని తెలంగాణలో విలీనం చేయాలి.
– కాంబ్లే లక్ష్మణ్, మాజీ సర్పంచ్, పరందోలి