హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్లో కొత్త కమిటీల ఏర్పాటుపై అసంతృప్త జ్వాలలు కొనసాగుతున్నాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై పార్టీ సీనియర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సోమవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో మధుయాష్కీగౌడ్, కోదండరెడ్డి, మహేశ్వర్రెడ్డితోపాటు పలువురు సీనియర్ నేతలు సమావేశమయ్యారు. రేవంత్రెడ్డి ఏకపక్ష వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కమిటీల ఏర్పాటులో సీనియర్లను విస్మరించారని, కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై నేడో రేపో ఢిల్లీకి వెళ్లి, నేరుగా అధిష్ఠానానికే ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
కొనసాగుతున్న రాజీనామాల పర్వం
కమిటీల ఏర్పాటుపై అసంతృప్తితో ఉన్న నేతలు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే కొండా సురేఖ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేయగా తాజాగా మరో నేత బెల్లయ్యనాయక్ రాజీనామా చేశారు. మరికొందరు నేతలు కూడా ఇదే బాటలో ఉన్నట్టు తెలుస్తున్నది. జిల్లా అధ్యక్షుల నియామకంపై కూడా రగడ మొదలైంది. పలు జిల్లాల్లో అధ్యక్షుడి నియామకానికి వ్యతిరేకంగా నేతలు గళం విప్పుతున్నారు. కొంతమంది నేతలు పార్టీకి రాజీనామా చేసే దిశగా యోచిస్తున్నట్టు తెలిసింది. కమిటీల ఏర్పాటు ప్రక్రియ మొత్తం రేవంత్రెడ్డి, మాణిక్కం ఠాగూర్ కనుసన్నల్లోనే నడిచినట్టు సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. మూడో వ్యక్తి అభిప్రాయం కూడా తీసుకోలేదని విమర్శిస్తున్నారు. వారికి నచ్చినవారికి, అనుయాయులకు ప్రధాన కమిటీల్లో చోటు కల్పించారని ఆరోపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ నేతలకు తీరని అన్యాయం చేశారని, సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు.
నాకూ సమాచారం ఇవ్వలేదు: భట్టి విక్రమార్క
కమిటీ ఏర్పాటుపై తనకు కూడా సమాచారం ఇవ్వలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇలా ఎందుకు జరిగిందో రేవంత్రెడ్డి, మాణిక్కం ఠాగూర్కే తెలియాలని వ్యా ఖ్యానించారు. పలువురు నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై తమ ఇంట్లో నిర్వహించిన భేటీలో చర్చించామని, వీటన్నింటిని క్రోడీకరించి అధిష్ఠానానికి అందజేస్తామని స్పష్టంచేశారు.