హైదరాబాద్ : తమిళనాడులోని కాంచీపురంలో తమిళనాడు వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయదారులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు చర్చనీయాంశంగా మారాయి. సమావేశంలో రైతులకు నేరుగా మార్కెటింగ్ సౌకర్యం, గిట్టుబాటు ధర కల్పించడం మధ్యవర్తులు లేని మార్కెట్ కల్పించడంపై చర్చించినట్లు దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహంనాయుడు తెలిపారు. ఈ సమావేశానికి తమిళనాడు రాష్ట్ర మంత్రులు అన్బరసన్, చక్రపాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోటపాటి నరసింహంనాయుడు తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తోపాటు పంటలకు అవసరమైన నీటినందించేందుకు చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతున్న తీరును వివరించారు. ఈ సందర్భంగా పలువురు రైతు నేతలు, వ్యాపారవేత్తలు తెలంగాణ సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలను దేశమంతా అనుసరిస్తే రైతు రాజవుతాడని అభిప్రాయపడ్డారు. సమావేశంలో రైతు నేతలు పీకే దైవశిగామని, ఏకేబాబు, ఎమ్మెల్యే కే సుందర్, రైతు సంఘాల నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.