Assembly | అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ కొనసాగుతున్నది. చర్చ మొదలైనప్పుడు సభలో సభ్యులు చాలా తక్కువగా ఉండటంపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సభలో కోరం ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. దాంతో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు సభలో 18 మందిమి ఉన్నామని చెప్పారు. సభలో 14 మందిమే ఉన్నామని, కావాలంటే లెక్కించండని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీ తరఫున కడియం శ్రీహరి బడ్జెట్పై చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో లేకపోవడాన్ని ప్రస్తావించారు. బడ్జెట్పై చర్చకు ఎవరు సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. దాంతో కొన్ని కారణాలవల్ల ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభకు హాజరు కాలేదని, బడ్జెట్పై రిప్లై ఇచ్చే సమయానికి వస్తారని శ్రీధర్ బాబు చెప్పారు. బడ్జెట్పై చర్చ విషయంలో ప్రభుత్వం సీరియస్గా లేదని అర్థమవుతోందని ఈ సందర్భంగా కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.
ఇందిరమ్మ పాలన అరాచకం: కడియం
అనంతరం కడియం బడ్జెట్పై చర్చను కొనసాగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇందిరమ్మ పాలన గురించి చెబుతుంటుందని, ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీని ఎవరూ మర్చిపోరని అన్నారు. ఎమర్జెన్సీ కాలానికి మంచిన నిర్బంధాలు, అరాచకాలు ఏమీ ఉండవని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీదే కుటుంబ పాలన అని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఒక్క కుటుంబానికే సేవ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మీరు ఒక కుటుంబం కోసం పనిచేస్తూ మాది కుటుంబ పాలనని ఎట్లా అంటారని ప్రశ్నించారు. దాంతో ఇవాళ్టి ఎజెండా ప్రకారం బడ్జెట్ మీద మాట్లాడాలని మంత్రి పొన్నం సూచించారు.