హైదరాబాద్ జూలై 2, (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని, యశ్వంత్ సిన్హాను గెలిపించాలని కేసీఆర్ పిలుపు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘ఆత్మప్రబోధానుసారం ఓటు’ కొత్తేమీ కాదు. అందుకు మాజీ రాష్ట్రపతి వీవీ గిరి ఉదంతమే నిదర్శనం. 1969లో రాష్ట్రపతిగా ఉన్న జాకీర్ హూస్సేన్ ఆకస్మికంగా మరణించడంతో నాడు ఉప రాష్ట్రపతిగా ఉన్న వీవీ గిరి తాత్కాలిక రాష్ట్రపతి అయ్యారు.
ఆ తర్వాత జరిగిన ఎన్నికలో గ్రూప్ తగాదాలతో కాంగ్రెస్ తన అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డిని ఎంపిక చేసింది. దీంతో వీవీ గిరి రాష్ట్రపతిగా పోటీలో దిగారు. ఆ సమయంలో సంజీవరెడ్డిని రాష్ట్రపతిగా ఎంపిక చేయడం ఇష్టం లేని నాటి ప్రధాని ఇందిర.. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత హోదాలో ఆయనకు మద్దతుగా విప్ జారీ చేయకపోగా.. ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని పిలుపునిచ్చారు. దీంతో ఆగ్రహించిన సంజీవరెడ్డి వర్గం రెండో ప్రాధాన్య ఓటును వీవీ గిరికి కాకుండా జనసంఘ్, స్వతంత్ర పార్టీలు బలపరిచిన సీడీ దేశ్ముఖ్కు వేయాలని పిలుపునిచ్చింది.
చివరకు ఇందిర వర్గీయులు ఆత్మప్రబోధానుసారం ఓటు వేసి వీవీ గిరిని బలపర్చారు. వామపక్షాలు సైతం వీవీ గిరి వైపే మొగ్గు చూపాయి. ఫలితంగా నీలం సంజీవరెడ్డి ఓడిపోయి వీవీ గిరి గెలిచారు. అప్పటి నుంచి రాజకీయాల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలన్న పిలుపు అడపా దడపా వినిపిస్తూనే ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ సైతం రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు పలకాలని పిలుపు ఇవ్వడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశం అయింది.