పెద్దపల్లి, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ, దసరా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే.. తెలంగాణను పూర్తిగా విస్మరించింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్లోనే ఉన్నా ప్రత్యేక రైళ్లు మాత్రం ఆంధ్రాకే నడుస్తుండటంతో తెలంగాణ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్షతోపాటు.. దక్షిణ మధ్య రైల్వే జోన్ కార్యాలయంలో అత్యధికంగా ఉన్నత స్థాయి అధికారులు ఆంధ్రా ప్రాంతం వారే కావడంతో రైల్వే సేవలు ఆంధ్రా ప్రాంతానికి విస్తృతంగా.. తెలంగాణకు నామ మాత్రంగా అందుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాలకు పండుగ ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టడంలో అధికారులు పూర్తిగా వివక్షను చూపుతున్నారు. అదే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, నర్సాపురం, కాకినాడకు రైళ్లు ఎక్కువగా నడుపుతున్నారు.