హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ విధానంపై దాఖలైన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్యదర్శి, సమాచారశాఖ కమిషనర్, మీడియా అకాడమీ చైర్మన్లను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అక్రెడిటేషన్ కమిటీ, నిబంధనలు, అక్రెడిటేషన్ అర్హతలపై ప్రభుత్వం జీవో 22 జారీచేసింది.
దీనిని సవాలు చేస్తూ హైటెక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ వేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ బెంచ్ మంగళవారం విచారించింది. కేబుల్ చానల్స్, డిజిటల్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ల జారీకి నిబంధనలు వివక్షతో ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. జీవో అమలు నిలిపివేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. విచారణను మార్చి 12కు వాయిదా వేసింది.