Telangana | హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో వివక్ష, రాజకీయ జోక్యం పెరుగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన బదిలీల్లో క్లీన్చిట్ ఉన్నవారికి వారి సామర్థ్యం మేరకు పోస్టింగ్లు ఇచ్చారనే అభిప్రాయం తొలుత వ్యక్తమైనా, క్రమం గా పరిస్థితి మారుతున్నది. ఇటీవల 23 మంది ఐపీఎస్లను బదిలీ చేయగా, రాజకీయ నాయకులు జోక్యంతో పలువురు అధికారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అంటున్నారు. కొందరి ట్రాక్ రికార్డుపై ఆయా జిల్లాల రాజకీయ నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. వారిని బాధ్యతలు చేపట్టవద్దని మౌఖికంగా ఆదేశించినట్టు సమాచారం. దీంతో మళ్లీ ఐపీఎస్ల బదిలీలు తప్పవనే ప్రచారం ఊపందుకున్నది.
ఐపీఎస్ల పోస్టింగ్ల విషయంలో ఏ అభ్యంతరాలకూ తావు లేకుండా కచ్చితంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నదని పైకి చెప్తున్నప్పటికీ, రాజకీయ రంగు పులుముకోవడంతోనే కొందరి బదిలీలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఐపీఎస్లు తాము వెయింటింగ్కు వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నారు. త్వరలో జరుగబోయే ఐపీఎస్ల బదిలీల్లో ప్రస్తుతం బాధ్యతలు చేపట్టకుండా ఉన్న వారి జాబితాను కూడా చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. కోరుకున్న చోట పోస్టింగ్ కోసం కొందరు ఐపీఎస్లు శక్తిమేరకు లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఐపీఎస్ల బదిలీల్లో రాజకీయ ప్రమేయం మంచిది కాదనే అభిప్రాయాన్ని సీనియర్ అధికారులు వ్యక్తంచేస్తున్నారు.