న్యూశాయంపేట,డిసెంబర్ 26: బీజేపీ డీఎన్ఏలోనే తెలంగాణ పట్ల వివక్ష ఉన్నదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఎద్దేవా చేశారు. కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటును కేంద్రప్రభుత్వం తిరస్కరించినందుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ జిల్లా కాజీపేట చౌరస్తాలో దాస్యం వినయ్భాస్కర్, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. దశాబ్దాల నుంచి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కాజీపేట ప్రజల కలను కలగానే మిగిల్చాయని మండిపడ్డారు. 1980లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు కాజీపేట ఫ్యాక్టరీని మంజూరు చేస్తే అయోధ్యపురం, మడికొండ పరిసర ప్రాంతాల్లో స్థల సేకరణకు కూడా ప్రతిపాదనలు చేశారన్నారు. కానీ అప్పుడు పంజాబ్ అల్లర్లను తగ్గించడానికి లొంగోవాల్ ఒప్పందం ప్రకారం కాజీపేటకు మంజూరైన ఫ్యాక్టరీని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్కు తరలించిందని గుర్తుచేశారు. అప్పుడు స్థానికంగా అనేక ఉద్యమాలు జరిగాయని, కోచ్ ఫ్యాక్టరీ సాధన పోరాట సమితి పేరుతో కూడా దశాబ్ద కాలంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయని చెప్పారు.
కోచ్ ఫ్యాక్టరీని మరిపించడానికి పీఓహెచ్ వ్యాగన్ పరిశ్రమ పేర్లతో చిన్న పరిశ్రమలు మంజూరు చేశారని 160 ఎకరాల భూమి స్థలం సేకరించి ఇచ్చినా కూడా రైల్వే శాఖ సాకులు చెబుతూ వాయిదా వేస్తూ వస్తున్నదని ధ్వజమెత్తారు. ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు పరిశ్రమలను, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో కేంద్రమంత్రి తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని లిఖిత పూర్వక సమాధానం ఇస్తే స్థానిక బీజేపీ నాయకులేమో రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించట్లేదని ప్రచారం చేయడం బీజేపీ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరగా వారికి కండువా కప్పి దాస్యం వినయ్ పార్టీలోకి స్వాగతం పలికారు.