హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ హిమాయత్నగర్లోని తెలుగు అకాడమీ నిధుల కుంభకోణం కేసు దర్యాప్తులో వేగం పుంజుకున్నది. గోల్మాల్లో దళారులదే కీలకపాత్రగా తెలుస్తున్నది. కలర్ జిరాక్స్లతో రూ.64 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేసి, నకిలీ పత్రాలతో అకాడమీ పేరిట బ్యాంకు ఖాతాను తెరిచినట్టు విచారణలో తేలింది. ఈ కేసులో ఏపీ మర్కంటైల్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ బీవీవీఎన్ సత్యనారాయణను విజయవాడలో, సొసైటీ మేనేజర్ (ఆపరేషన్స్) వేదుల పద్మావతి, రిలేషన్స్ మేనేజర్ సయ్యద్ మొహినుద్దీన్ను హైదరాబాద్లో అరెస్టు చేసినట్టు సీసీఎస్ జాయింట్ సీపీ అవినాశ్ మహంతి శుక్రవారం వెల్లడించారు. సూత్రధారుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. శనివారం మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నట్టు తెలిసింది.
అకాడమీ నిధులు రూ.64 కోట్లు హైదరాబాద్లోని వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే సమయంలో ముగ్గురు ఏజెంట్లుగా వ్యవహరించారు. వీరే ఫిక్స్డ్ డిపాజిట్ల బాండ్లను కలర్ జిరాక్స్ తీసి పెట్టారు. సిద్దిఅంబర్ బజార్లోని ఏపీ మర్కంటైల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్లో నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో అకాడమీ పేరిట ఒక ఖాతా తెరిచారు. నకిలీ కలర్ జిరాక్స్ బాండ్లతో మూడు బ్యాంకుల్లోని రూ.64 కోట్ల డిపాజిట్లు రద్దు చేయించారు. బ్యాంకు అధికారులు కూడా దళారులతో కుమ్మక్కై.. ఆ మొత్తాన్ని అగ్రసేన్ బ్యాంకులోని ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాలోకి బదిలీ చేశారు. తర్వాత సొసైటీ ఖాతా నుంచి అకాడమీ పేరిట ఉన్న ఖాతాలోకి రూ.64 కోట్లు బదిలీ చేయించి స్వాహా చేశారు.
విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేనకు ప్రభుత్వం తెలుగు అకాడమీ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. అకాడమీలో నిధుల గోల్మాల్ కేసులో పోలీసులు పలువురిని అరెస్టు చేయడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా డైరెక్టర్ ఎం సోమిరెడ్డిని ఆ పోస్టు నుంచి తప్పించింది. మరోవైపు, నిధుల గోల్మాల్పై విచారణ జరుపుతున్న ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ శనివారం ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నది.