హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాక్సిన్ లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో టీకా పంపిణీలో ‘రెండో డోస్’ తీసుకోవాల్సిన వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నామని ప్రజారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే ఒకడోస్ తీసుకొని ప్రతిరక్షకాలు ఏర్పడినవారికి సెకండ్డోస్ వేసి పూర్తి రక్షణ కల్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఈ మేరకు రెండోడోస్ కోసం నిర్ణీత గడువు పూర్తయినవారికి ముందుగా టీకాలు వేస్తామని వివరించారు. తర్వాత ప్రాధాన్యక్రమంలో ప్రతి ఒక్కరికీ ఇస్తామని స్పష్టంచేశారు. ఈ నెల 12 తర్వాత లభ్యతనుబట్టి మొదటి డోస్ టీకాలు కూడా వేస్తామని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్కు సిద్ధంగా ఉన్నామని.. అయితే టీకాల ఉత్పత్తి తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. పరిస్థితులను అర్థం చేసుకొని 18-44 ఏండ్ల మధ్య వయసు వారు కాస్త ఓపిక పట్టాలని విజ్ఞప్తిచేశారు. శుక్రవారం డీఎంఈ రమేశ్రెడ్డితో కలిసి డీహెచ్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈనెల 31 వరకు 19,92,257 మందికి రెండోడోస్ వేయాల్సి ఉన్నదని చెప్పారు. ఇందులో 3,30,714 మందికి కొవాగ్జిన్, 16,61,543 మందికి కొవిషీల్డ్ వేయాల్సి ఉన్నదని తెలిపారు. ఈనెల 15 నాటికి సుమారు 4,99,432 మంది సెకండ్ డోస్ తీసుకోవాల్సి ఉన్నదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,74,900 డోసులు మాత్రమే నిల్వ ఉన్నాయని, 15వ తేదీ వరకు మరో 3.11 లక్షల డోసులు రావొచ్చని తెలిపారు.
రెండో డోస్ టీకాలోనూ తేదీని బట్టి ప్రాధాన్యమిస్తామని శ్రీనివాసరావు చెప్పారు. కొవిన్ సాఫ్ట్వేర్లో నేరుగా సెకండ్ డోస్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం లేదని, ఈ మేరకు మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. ఆలోగా ఎవరు, ఎక్కడ సెకండ్ డోస్ వేసుకోవాలో మెసేజ్లు లేదా ఇతర సాధనాల ద్వారా సమాచారమిస్తామని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరంలేదని చెప్పారు.
రోజూ 2-2.5 లక్షల డోసులు వేసే సామర్థ్యం రాష్ర్టానికి ఉన్నదని.. ఈ మేరకు టీకాలు పంపిణీ చేయాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరారని శ్రీనివాసరావు వివరించారు. స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లు వచ్చినా, వాటికి ఇంకా కొన్ని తుది పరీక్షలు చేయాల్సి ఉన్నదని చెప్పారు. అవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇకపై రోజూ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహిస్తామని డీహెచ్ తెలిపారు. హెల్త్ బులెటిన్ సైతం ఏ రోజుకారోజే విడుదల చేస్తామని చెప్పారు. ‘ట్రీట్మెంట్ ఫస్ట్’ అన్న సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే కొనసాగుతున్నదని డీహెచ్ తెలిపారు. శుక్రవారం 1,247 ఆరోగ్య కేంద్రాల్లో 1,41,714 మందికి కొవిడ్ ఓపీ సేవలు అందించినట్టు చెప్పారు. ఇందులో 19,099 మందికి లక్షణాలు ఉండగా, కిట్లు అందించినట్టు వెల్లడించారు. కొన్ని రోజులుగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని డీహెచ్ పేర్కొన్నారు. రాబోయే 3-4 వారాల్లో కేసులు, పాజిటివిటీ రేటు తగ్గే అవకాశం ఉన్నదని.. తద్వారా ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడినట్టేనని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను వీటిని 15 వేలకు పెంచుతున్నామని డీఎంఈ రమేశ్రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీలో అదనంగా 2,300, జిల్లాల్లో 3వేల పడకలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దవాఖానలపై అంతస్తుల్లో షెడ్లువేసి పడకల ఏర్పాటుపై చర్చిస్తున్నామన్నారు. కేంద్రం 51 ఆక్సిజన్ జనరేటర్లను ఇస్తున్నదని.. వాటిని నెలరోజుల్లో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. దీంతో జిల్లా, ఏరియా దవాఖానల్లోనూ నిరంతర ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని, హైదరాబాద్కు రావాల్సిన అవసరం ఉండదని చెప్పారు. మరోవైపు అంబులెన్స్లలో ఎదురుచూసే అవకాశం లేకుండా.. దవాఖాన ఎంట్రీ వద్దే ప్రత్యేకంగా ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నామని.. దీంతో రోగి రాగానే ఆక్సిజన్ బెడ్మీదికి చేర్చి.. పరిస్థితిని బట్టి వార్డుకు లేదా ఐసీయూకు తరలిస్తారని తెలిపారు. జిల్లాల్లో ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయని, అనవసరంగా హైదరాబాద్కు రావొద్దని సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో రెమ్డెసివిర్ సహా ఎలాంటి మందుల కొరత లేదని, రెమ్డెసివిర్, టోసిలిజుమాబ్ వినియోగానికి ప్రత్యేక ప్రొటోకాల్ పాటిస్తున్నట్టు చెప్పారు. అనవసరంగా టోసిలిజుమాబ్ వాడితే ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు.
కేంద్రం అస్తవ్యస్త పాలసీ వల్లే టీకా పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మొదటి డోసు వ్యాక్సినేషన్ను అట్టహాసంగా ప్రారంభించిన కేంద్రం.. దేశ జనాభాలో 13.09 కోట్ల మందికి మాత్రమే వేయించగలిగింది. ఇక రెండోడోసు 3.15 కోట్ల మందికి మాత్రమే అందించగలిగింది. దీంతో మొదటిడోసు వేసుకున్నవారికి గడువులోగా రెండోడోసు ప్రశ్నార్థకంగానే మారుతున్నది. దేశమంతా ఇదే పరిస్థితి. బీజేపీ పాలిత రాష్ర్టాలకే ఎక్కువగా టీకాలను సరఫరాచేస్తూ.. ఇతర రాష్ర్టాలపై వివక్ష చూపారనే ఆరోపణలూ ఉన్నాయి. 2020 అక్టోబర్ నాటికి రాష్ర్టాల్లో జనాభాను అంచనావేసి వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నట్టు కేంద్రం చెప్తున్నది. దానిప్రకారం తెలంగాణ జనాభా 3,75,99,000. కానీ, ఇప్పటివరకు పంపించిన వ్యాక్సిన్లు 53.71 లక్షలు మాత్రమే. అంటే రాష్ట్ర జనాభాలో 14.28% మందికే వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసింది. కరోనా ఎక్కువ వ్యాప్తి చెందుతున్న మహారాష్ట్రకూ అతి తక్కువగానే అందజేస్తున్నది.