Qu Dongyu | గజ్వేల్/మర్కూక్, జూన్ 15: తెలంగాణ రైతుల ముఖాల్లో తాను చిరునవ్వులు చూశానని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డొంగ్యూ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయరంగ సంస్కరణలు, రైతుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తిలోని కొండపోచమ్మ ప్రాజెక్టును గురువారం ఆయన తన బృందంతో కలిసి సందర్శించారు.
పంప్హౌస్ను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్రావు, ఈఎన్సీ హరిరాం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రయోజనాలను వివరించారు. ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు అవశ్యకతలను కళ్లకుగట్టారు. మోటార్ల పనితీరు తెలుసుకొని డొంగ్యూ ఆశ్చర్యపోయారు. ప్రాజెక్టు వివరాలన్నీ అధికారులనుంచి ఆసక్తిగా అడిగి తెలుసుకొన్నారు. అనంతరం మర్కూక్ రైతు వేదికలో రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో డొంగ్యూ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు ప్రధానంగా కావాల్సింది సాగునీరు అని, తెలంగాణలో రైతుల కోసం కేవలం మూడేండ్ల వ్యవధిలోనే అనేక పెద్ద ప్రాజెక్టులు పూర్తిచేయడం అద్భుతం అని కొనియాడారు. రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలు బాగున్నాయని కితాబిచ్చారు.
తనది రైతు కుటుంబం అని, తల్లిదండ్రులు 2.5 ఎకరాల్లో వ్యవసాయం చేసి వరి పండించేవారని తెలిపారు. తాను రైతుబిడ్డగా 50 ఏండ్ల కింద వ్యవసాయం చేసి ఉన్నతస్థాయికి ఎదిగానని, వ్యవసాయం చేయడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో తనలాగే ఎఫ్ఏవో డీజీ స్థాయికి తెలంగాణ నుంచే రైతుబిడ్డ రావాలని ఆకాంక్షించారు. అనంతరం ఐక్యరాజ్యసమితి బృంద సభ్యులను వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందర్రావు, డీఏవో శివప్రసాద్, అధికారులు, మండల ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. డొంగ్యూ వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత్ జిందగీ, ఎస్ఈ వేణు, అదనపు కలెక్టర్ ముజామిల్ఖాన్, ప్రొఫెసర్ సునీత, ఎస్ఈ వేణు ఉన్నారు.