హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ను సమకూర్చామని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవాన్ని పురస్కరించుకొని దవాఖానలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బీరప్ప మాట్లాడుతూ.. గతంలో శస్త్రచికిత్సలకు అవసరమైన సీ-ఆర్మ్ యంత్రాలు ఒకటి రెండు మాత్రమే ఉండేవని, దీంతో సర్జరీల కోసం రోగులు నిరీక్షించాల్సి వచ్చేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో నిమ్స్లోని ప్రతి విభాగానికి ఒక సీ-ఆర్మ్ యంత్రం, న్యూరో సర్జరీ విభాగంలో 3డీ-సీ-ఆర్మ్ యంత్రం అందుబాటులో ఉన్నట్టు వివరించారు.
ఫలితంగా సర్జరీలు త్వరితగతిన జరగడమే కాకుండా ఎక్కువ మందికి శస్త్రచికిత్సలు చేయగలుగుతున్నట్టు తెలిపారు. రేడియాలజీ డిపార్ట్మెంట్లో రెండు సిటీ స్కాన్ యంత్రా లు, రెండు ఎంఆర్ఐ యంత్రాలు, మమోగ్రఫీ, బోన్ డెన్సిటీ, ఎక్స్రే, మొబైల్ ఎక్స్రే యంత్రాలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. త్వరలోనే కొత్త డీఎన్ఏ యంత్రం కూడా అందుబాటులోకి రానున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ అనుకపూర్, డీన్ డాక్టర్ లిజారాజశేఖర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డాక్టర్ శాంతవీర్, రేడియాలజీ సీనియర్ ప్రోఫెసర్ డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ జ్యోత్స్న, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ లక్ష్మీభాస్కర్, నిమ్స్ పీఆర్వో సత్యాగౌడ్, హాస్పిటల్ అనుసంధాన కర్త డాక్టర్ మార్త రమేశ్ తదితరులు
పాల్గొన్నారు.