హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై చర్యలు చేపట్టేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంతో కేటీఆర్కు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయన పాత్ర ఉన్నట్టు సురేఖ గత నెల 16న విలేకరుల సమావేశంలో ఆరోపించారని, పైపెచ్చు కేటీఆర్ను జైలుకు పంపిస్తామని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టాలన్న కుట్రతో ఆమె కేటీఆర్పై నిరాధార ఆరోపణలతో ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించారని వివరించారు. దీనిపై ఈ నెల 8న తాము చేసిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ కమిషనర్కు పంపడాన్ని ఎన్నికల నిబంధనలకు విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.