హైదరాబాద్/వరంగల్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీటిని అందించే ‘మిషన్ భగీరథ’ పథకం భవిష్యత్తు తరాలకు పాఠంగా నిలిచింది. ప్రతి ఊరికి, ప్రతి ఇంటికీ ప్రభుత్వం ఉచితంగా శుభ్రమైన తాగునీటిని అందించే కార్యక్రమం దేశంలో మొదటిసారి తెలంగాణలోనే సాధ్యమైంది. మిషన్ భగీరథతోపాటు మిషన్ కాకతీయ పథకాలపై డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టాలని కాకతీయ యూనివర్సిటీ భావిస్తున్నది. 2022- 23 విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ అంశంపై బుధవారం కేయూ అధికారులు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత కేయూ దూరవిద్య ద్వారా ఈ కోర్సులను ప్రవేశపెట్టి, స్పందనను బట్టి రెగ్యులర్ కోర్సులుగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 2018 సంవత్సరం నుంచే ఈ రెండు పథకాలను బీఎస్సీ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ సబ్జెక్టులో చేర్చారు. వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ను 100 మార్కులకు నిర్వహిస్తుండగా, ఇది పూర్తిచేసిన వారికి 4 క్రెడిట్లను జారీచేస్తున్నారు. ఈ సబ్జెక్టులోని యూనిట్ -4లో భాగంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను బోధిస్తుండగా, తాజాగా సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మిషన్ భగీరథ పథకం ఆవశ్యకత, ఏర్పాటు, నిర్వహణ, వంటి అన్ని అంశాలను వివరించేలా కోర్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసున్నారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలపై డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను 100 మార్కులకు నిర్వహిస్తాం. డిగ్రీ విద్యార్థులే కాకుండా, ఇంటర్, పాలిటెక్నిక్ పూర్తిచేసిన వారు సైతం ఈ కోర్సులో చేరవచ్చు. ప్రస్తుతానికి దూరవిద్యలో భాగంగా ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. త్వరలోనే రెగ్యులర్ కోర్సుగా ప్రవేశపెట్టి, ఏదైపా ఒక డిపార్ట్మెంట్కు అనుబంధంగా ఈ కోర్సులను నిర్వహిస్తాం.
–ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, కేయూ వైస్చాన్స్లర్