హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : సోలార్ పవర్ను వినియోగించేందుకు చర్యలు తీసుకొన్న తెలంగాణ ఫుడ్స్ మరో ముందడుగు వేసింది. ఇక నుంచి సంస్థ కార్యకలాపాలన్నీ డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది. ఫ్యామిలీ సెర్చ్, సాల్ట్ లేక్ సిటీ అమెరికా సహకారంతో ఈ డిజిటల్ పనులు చేపట్టనున్నట్టు టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ తెలిపారు. మంగళవారం ఫ్యామిలీ సెర్చ్, సాల్ట్ లేక్ సిటీ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకొన్నారు. మేడె రాజీవ్సాగర్ మాట్లాడుతూ, తెలంగాణ ఫుడ్స్ ప్రారంభమైననాటి నుంచి (1976) ఇప్పటి వరకు సంస్థకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ను డిజిటల్ రూపంలోకి మార్చుతామని తెలిపారు. ఫ్యామిలీ సెర్చ్ ఏరియా మల్టీ కంట్రీ మేనేజర్ ఎం. సురేశ్ రామకృష్ణ, మైనారిటీ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ శంకర్లుక్, ఫ్యామిలీ సెర్చ్ ప్రతినిధి మనోహర్తో ఒప్పందం చేసుకొన్నట్టు వివరించారు.