హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : వచ్చే రెండు, మూడు నెలల్లో రాష్ట్రంలో డిజిట ల్ మీడియా పాలసీ తీసుకురానున్నట్టు పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. జర్నలిస్టుల సమస్యలపై శాసనమండలిలో బుధవా రం సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్రావు, నెల్లికంటి సత్యం, తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్నల కు మంత్రి సమాధానం ఇచ్చారు. జర్నలిస్టు మిత్రులకు భద్రత కల్పించే విషయంలో తమ ప్రభుత్వం రాజీపడబోదని స్పష్టంచేశారు. అక్రెడిటేషన్ల జారీ విషయంలో కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. ఎలాంటి భేషజాలకు పోకుం డా మొదట విడుదల చేసిన జీవోపై అన్ని జర్నలిస్టు సంఘాల అభిప్రాయాలు, సూచనలు తీసుకొని జీవోలో మార్పులు చేసినట్టు చెప్పా రు. డెస్ జర్నలిస్టులు, మరో జర్నలిస్టులు అనే తేడా తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. ఇండ్ల స్థలాల విషయంలోనూ సానుకూల నిర్ణయం తీసుకుంటామని, ఇప్పటికే ఈ విషయంలో సీఎం రేవంత్ స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. న్యాయస్థానం పరిధిలో ఇబ్బందుల్లేకుండా ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు.
‘ఇందిరమ్మ ఇండ్లు’ నిరంతర ప్రక్రియ
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి స్పష్టంచేశారు. మూడేండ్లలో పట్టణ ప్రాంతాల్లోని ప్రతి వార్డులో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని ప్రకటించారు. శాసనమండలిలో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, కాంగ్రెస్ సభ్యులు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చా రు. ఏప్రిల్, మేలో రెండో విడత ఇండ్ల మం జూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. తండాలు, గూడేల్లో వివిధ స్థాయి ల్లో నిలిచిపోయిన ఇండ్ల నిర్మాణాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు.