హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ):భూరికార్డుల ప్రక్షాళనతో 99% వ్యవసాయ భూముల వివరాలు ధరణిలో పొందుపరిచారు. పక్కాగా ఉన్న ఈ భూములకు డిజిటల్ సర్వే ద్వారా పూర్తి రక్షణ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 11వ తేదీ నుంచి ఎంపికచేసిన గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ సర్వే చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మంగళవారం క్యాబినెట్ భేటీలో మంత్రిమండలి ఆమోదించింది. ఇకపై వ్యవసాయభూముల సెటిల్మెంట్ అనే వ్యవహారం ఉత్పన్నం కాదని, ఇప్పటికే సమస్యలు లేకుండా వివాదాలు పరిష్కారమయ్యాయని మంత్రిమండలికి రెవెన్యూశాఖ వివరించింది. రాష్ట్రప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టం- 2020 ప్రకారం 99% వ్యవసాయభూములు సమస్యలు లేకుండా ధరణిలో నమోదయ్యాయని తెలిపింది. రైతులు కాస్తులో ఉన్న భూములకు, భౌతికంగా ఉండే హద్దురాళ్లు, కాగితాలమీద ఉండే టీపన్ నక్షాతో కూడిన కొలతలు డిజిటల్ రూపంలోకి మారుతాయని.. రాళ్లు ఊడిపోయినా కొలతల కాగితాలు చినిగిపోయినా రైతుల పట్టా భూములకు ఇంచుతేడా రాకుండా డిజిటల్ మ్యాప్ ద్వారా రక్షణ లభిస్తుందని రెవెన్యూశాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ భూములకు వాటి కొలతల ప్రకారం డిజిటల్ సర్వే చేపట్టి, అక్షాంశ రేఖాంశాలను (కో ఆర్డినేట్స్ )ను నిర్ధారించాలని, హైదరాబాద్ మినహా ఉమ్మడి 9 జిల్లాల్లో 3 చొప్పున 27 గ్రామాల్లో సర్వేను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలన్న నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదించింది.